Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్
భారతదేశంలో జరిగే ప్రతి ప్రధాన నిర్మాణంలోనూ అల్ట్రాటెక్ భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో నిర్మితమయ్యే ప్రతి మూడు ఇళ్లలో ఒకటికి, ప్రతి ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గంలో నాలుగు కిలోమీటర్లకు అల్ట్రాటెక్ సిమెంటే ఆధారం. సెంట్రల్ విస్టా (నూతన పార్లమెంట్ భవనం)
- Author : Sudheer
Date : 21-04-2026 - 8:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ భారత పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశీయంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 200 మిలియన్ టన్నుల (MTPA) మైలురాయిని దాటించినట్లు సంస్థ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్ మరియు ఆంధ్రప్రదేశ్ (వైజాగ్) లలో మూడు కొత్త గ్రైండింగ్ యూనిట్లను ప్రారంభించడంతో ఈ ఘనత సాధ్యమైంది. దీనితో చైనా మినహా ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ సంస్థగా అల్ట్రాటెక్ అవతరించింది.
అల్ట్రాటెక్ వృద్ధి ప్రస్థానాన్ని పరిశీలిస్తే, సంస్థ సాధించిన వేగం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదటి 100 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకోవడానికి అల్ట్రాటెక్కు సుమారు 36 ఏళ్లు పట్టింది. కానీ, తర్వాతి 100 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యాన్ని కేవలం 7 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ప్రస్తుతం భారతదేశంలో ఈ సంస్థ సామర్థ్యం 200.1 MTPA కాగా, యూఏఈ, శ్రీలంక వంటి దేశాల్లోని యూనిట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 205.5 MTPAకు చేరుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ చూపుతున్న వేగానికి అల్ట్రాటెక్ విస్తరణ అద్దం పడుతోంది.
భారతదేశంలో జరిగే ప్రతి ప్రధాన నిర్మాణంలోనూ అల్ట్రాటెక్ భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో నిర్మితమయ్యే ప్రతి మూడు ఇళ్లలో ఒకటికి, ప్రతి ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గంలో నాలుగు కిలోమీటర్లకు అల్ట్రాటెక్ సిమెంటే ఆధారం. సెంట్రల్ విస్టా (నూతన పార్లమెంట్ భవనం), ముంబై కోస్టల్ రోడ్, ద్వారకా ఎక్స్ప్రెస్ వే మరియు బుల్లెట్ రైలు కారిడార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి (Sustainability) కూడా సంస్థ పెద్దపీట వేస్తోంది.