Sudha Murty : సమాజానికి తిరిగివ్వాలని నేర్పింది నా కూతురే : సుధామూర్తి
సమాజ సేవలో ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి దేశవ్యాప్తంగా మంచిపేరును సంపాదించారు.
- By Pasha Published Date - 03:19 PM, Sat - 20 July 24
Sudha Murty :సమాజ సేవలో ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి దేశవ్యాప్తంగా మంచిపేరును సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే తనలో సేవాభావం కలగడానికి గల ముఖ్యమైన కారణాన్ని తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా సుధామూర్తి(Sudha Murty) వెల్లడించారు. ఇందులో తన తన కుమార్తె అక్షతామూర్తి గురించి కీలక వివరాలను తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join
తన కూతురు అక్షతామూర్తి వల్లే తనలో సేవా దృక్పథం కలిగిందని సుధామూర్తి తెలిపారు. మనకు ఉన్న దాంట్లో కొంత నలుగురితో పంచుకోవడంలో ఉన్న సంతోషం ఇంకా దేనిలోనూ ఉండదని తన కూతురు చెబుతుండేదన్నారు. ఆనంద్ శర్మ అనే అబ్బాయికి స్పాన్సర్షిప్ ఇవ్వాలని తన కూతురు అక్షత చేసిన అభ్యర్థనతోనే ఈ దాతృత్వ ప్రయాణం మొదలైందన్నారు.‘‘ఒకసారి అక్షత నా దగ్గరకు ఆనంద్ శర్మ అనే అబ్బాయిని తీసుకొచ్చింది. అతడు ప్రతిభావంతుడైన విద్యార్థి అని నాకు వివరించింది. పైచదువులకు అతడి దగ్గర డబ్బు లేదని తెలిపింది. ఆనంద్కు ఢిల్లీలోని ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ వచ్చినా ఫీజు కట్టేందుకు డబ్బులు లేవని చెప్పింది. ఫీజు ఎవరు కడతారని నన్ను అక్షత ప్రశ్నించింది. నువ్వే కట్టాలని నేను చెప్పా. నువ్వు నాకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదుగా.. నేనెలా ఇవ్వాలని అక్షత తిరిగి అడిగింది’’ అని సుధ గుర్తు చేసుకున్నారు.
Also Read :CM Revanth : వెంకయ్యనాయుడు, జైపాల్రెడ్డిలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
‘‘అమ్మా.. నువ్వు దాతృత్వం వైపు వెళ్లకుండా.. ఈ విషయంలో ఇతరులకు సలహాలు ఇవ్వడం సరికాదు’’ అని అక్షత తనకు ఆ సందర్భంలో చెప్పారని సుధ పేర్కొన్నారు. కొద్దిరోజులపాటు ఆలోచించిన తర్వాత పూర్తిస్థాయిలో దాతృత్వం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సుధామూర్తి అనేక పుస్తకాలు రాశారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవలకు సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వచ్చింది. 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్తో కేంద్రం ఆమెను సత్కరించింది. ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు.