Liquor Brands in AP : ‘జే బ్రాండ్స్’ రగడ
ఏపీలో `జే బ్రాండ్ల`వ్యవహారం అమరావతి నుంచి ఢిల్లీ వరకు వినిపించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై దద్దరిల్లింది.
- By Hashtag U Published Date - 05:01 PM, Sat - 19 March 22
ఏపీలో `జే బ్రాండ్ల`వ్యవహారం అమరావతి నుంచి ఢిల్లీ వరకు వినిపించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై దద్దరిల్లింది. అలాగే, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా ఏపీలోని జే ట్యాక్స్ గురించి గళం విప్పారు. మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాజాగా టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు పొలిట్ బ్యూరో మెంబర్ యనమల రామక్రిష్ణుడు డిమాండ్ చేశాడు.మద్య నిషేధం అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జగన్ ప్రచారం చేశాడు. ఆ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. కానీ, చంద్రబాబు హయాంలో వసూలు చేసిన ఎక్సైజ్ వాటా కంటే జగన్ సర్కార్ మించి పోయింది. పలు రకాల లోకల్ బ్రాండ్లు ఏపీలోని మద్యనిషేధానికి నిసా ఎక్కించాయి. మద్యాన్ని తయారు చేసే డిస్టలరీ కంపెనీలను అధికారికంగా బయట పెట్టాలి. ఆ కంపెనీలు సరఫరా చేసే మద్యం బ్రాండ్ల వ్యవహారం గుట్టుగా నడుస్తోంది. జగన్ సర్కార్ తొలి నుంచి దీనిపై ఆరోపణలను ఎదుర్కొంటోంది. సాక్షాత్తుగా స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలో ప్రవహిస్తోన్న అక్రమ సారా వ్యవహారాన్ని మీడియా ముఖంగా వెల్లడించాడు. ఏరులై సారా పారుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు కట్టడీ చేయలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తాడు.
డిస్టలరీలకు వాస్తవంగా టెండర్లు పిలవాలి. నాణ్యతను ఎక్సైజ్ విభాగం పరిశీలించాలి. బ్రాండ్లకు అనుమతి ఇచ్చే ముందు ఆ శాఖ అనుమతులు ఉండాలి. ఇవన్నీ ఏమీలేకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా పలు రకాల బ్రాండ్లను జగన్ సర్కార్ విక్రయిస్తోంది. నాసిరకం, కల్తీ సారాతో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాల క్రమంలో ఏపీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఢిల్లీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొద్ది రోజులుగా కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందడానికి కారణం ‘జే-బ్రాండ్ ` మద్యంగా టీడీపీ భావిస్తోంది. అమాయకుల ప్రాణాలను జగన్ సర్కార్ తీస్తోందని అనుమానిస్తోంది.
చీప్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ వ్యవహారం తొలి నుంచి జగన్ సర్కార్ కు మాయని మచ్చగా మిగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మద్యం కంటే 10 రెట్లు అధికంగా అధికార వైఎస్సార్సీపీ నేతలు జే బ్రాండ్ ల తో సంపాదిస్తున్నారని టీడీపీ అంచనా వేస్తోంది. దశలవారీగా నిషేధిస్తామన్న హామీని జగన్ తుంగలో తొక్కాడు. మద్యం విక్రయాల ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అక్రమ మద్యం కారణంగా సంభవిస్తోన్న మరణాల నివారణకు సీఎం చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. మూడేళ్లుగా మద్యం విక్రయాలు, ఆదాయం, పెరిగిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ నేత యనమల సవాల్ చేస్తున్నాడు. ఎంత వడ్డీ చెల్లించారు.. ఆ రుణాలకు ఏయే ఆస్తులను తాకట్టు పెట్టారు? కోట్లాది రూపాయల రుణాలు దేనికి ఖర్చు చేశారో.. ప్రజలకు తెలియాలి. మరిన్ని రుణాల కోసం దరఖాస్తు ఎక్కడ చేసుకున్నారేమో వెల్లడించాలని జగన్ ను టీడీపీ నిలదీస్తోంది. జగన్ పాలనలో మద్యం చావులు, కమీషన్లు, అప్పుల బెడద వెంటాడుతోందని యనమల అభిప్రాయపడ్డాడు. శ్వేతపత్రం జే బ్రాండ్ లపై విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Related News
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.