Chandrababu Helicopter : దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే ?
Chandrababu Helicopter : అరకు నియోజకవర్గంలో జరిగే ‘రా కదలిరా’ బహిరంగసభకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి బయలుదేరిన చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది.
- Author : Pasha
Date : 20-01-2024 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Helicopter : అరకు నియోజకవర్గంలో జరిగే ‘రా కదలిరా’ బహిరంగసభకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి బయలుదేరిన చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది. హెలికాప్టర్ పైలట్.. అరకు రూట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏటీసీ సూచనలను అతడు అర్థం చేసుకోలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఈ హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు హెలికాప్టర్ మార్గం మధ్య నుంచే వెనుదిరగాల్సి వచ్చింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. దీంతో పైలట్ కరెక్ట్ రూట్లో ప్రయాణించి అరుకులో హెలికాప్టర్ను ల్యాండ్ చేయగలిగాడు. దీంతో శనివారం మధ్యాహ్నం కాసేపు ఉత్కంఠ ఏర్పడింది. అరకుతో పాటు మన్యం మొత్తం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడం , చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో హెలికాప్టర్ దారి తప్పిందని తెలియడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారే హెలికాప్టర్ పైలట్లకు(Chandrababu Helicopter) రూట్ మ్యాప్ ఇస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని జోరుగా నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు చొప్పున బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హెలికాప్టర్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఉండవల్లి నివాసంలో ఓ హెలిప్యాడ్ ను రెడీ చేశారు. అలాగే ఎక్కడ సభలు జరుగుతున్నాయో ఆ సభా ప్రాంగణానికి దగ్గర్లో మరో హెలిప్యాడ్ రెడీ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఇలా సమన్వయ లోపం జరగలేదని.. రాంగ్ రూట్లో వెళ్లేంత ఇబ్బందికర పరిస్థితులు రాలేదని అంటున్నారు. ఇక్కడ పైలట్.. ఏటీసీతో సమన్వయం చేసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని.. వెంటనే ఏటీసీ నుంచి హెచ్చరికలు రావడంతో మళ్లీ సరైన విధంగా గమ్యస్థానం చేరుకున్నారని చెబుతున్నారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో పాటు చంద్రబాబు భద్రతా సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజకవర్గంలో సభను నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈఘటన తలెత్తింది.