Nandamuri Taraka Rama Rao : మరణంలేని జననం!
యుగపురుషుడు నందమూరి తారకరామారావు. ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా మెదులుతుంటారు
- By CS Rao Published Date - 05:53 PM, Fri - 27 May 22
యుగపురుషుడు నందమూరి తారకరామారావు. ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా మెదులుతుంటారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన విశ్వవిఖ్యాతిగాంచారు. కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మిడిల్ క్లాస్ అబ్బాయిలు పడే బాధలన్నింటికీ చూశారు. ఇంటింటికి తిరిగి పాలుపోస్తూ కష్టం విలువ తెలుసుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగిన మేరునగధీరుడు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను తిరుగులేని నాయకునిగా ఎన్టీఆర్ ఎదిగారు.
‘నందమూరి తారక రామారావు’ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్. `ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. కార్మికుడి కరిగిన కండాలల్లోనుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి’ అంటూ.. 1982 మార్చి 29న హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేవలం పదిమంది విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. తారకరాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తాం అంటూ రాయభారాలు మొదలయ్యాయి. ‘లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే’ వివేకానందుడి మాటల్ని ఒంటిపట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. ఓట్లేయండని.. జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారు.
చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి, దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టికరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు. ఎన్టీఆర్ పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది. ప్రతి మాట ఓ తూటాగా ఎన్టీఆర్ సందేశమే స్పూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడిన హీరో రాజకీయ నేతగానూ అభిమానించబడ్డారు. కృష్ణుడు అంటే ఎలా ఉంటారో, రాముడు అంటే ఎలా ఉంటారో తెలియని వారికి ఇదిగో వారి రూపం అంటూ నటుడిగా సాక్ష్యాత్కరించిన నటసార్వభౌముడు ఎన్టీఆర్. నాయకుడంటే ఇలా ఉంటాడు అని పాలించి చూపించారు. అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలిపేజీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అన్న ఎన్టీఆర్దే మొదటి స్థానం.
అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులే. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు
1942 మే నెలలో (20 ఏళ్ళ వయసులో) మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. మొత్తం 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధరేశ్వరి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా తొలి నుంచి ఉన్నారు. ఒకానొక సమయంలో హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని ఎన్టీఆర్ భావించారు. రాజకీయ వారసులుగా ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో ఊహించారు. కానీ, బలీయమైన విధి ఆయన్ను వంచించింది. చివరకు 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన లేయినప్పటికీ మరణంలేని జననం మాదిరిగా ఎన్టీఆర్ తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచిపోయారు.
Related News
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.