Parliament Session : పార్లమెంటులో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ
రాష్ట్ర విభజన ఏపీ, తెలంగాణ వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 18-09-2023 - 2:57 IST
Published By : Hashtagu Telugu Desk
సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో (Parliament Special Session) ప్రధాని మోడీ (PM Modi) ఏపీ విభజన (AP Division) అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన ఏపీ, తెలంగాణ వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని మోడీ చెప్పుకొచ్చారు. నాడు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆ మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా జరిగిందని, ఆ మూడు రాష్ట్రాల విభజన అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని, అన్ని చోట్లా సంబరాలు జరిగాయని .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రం ఆ విధంగా జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోదీ వ్యాఖ్యానించారు.
Read Also : AP : వైసీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా బ్రాహ్మణి..
అలాగే కొత్త పార్లమెంటు (New Parliament) భవనంలోకి అడుగు పెట్టే ముందు దేశ పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసారు. మనమంతా ఈ చారిత్రాత్మక భవనాన్ని వీడుతున్నామని … దేశ ప్రజల చెమట, రక్తంతో ఈ భవనం నిర్మించారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం ఈ భవనానికి పార్లమెంట్ హౌస్ అనే గుర్తింపు వచ్చిందన్నారు. పాత పార్లమెంటు భవనం రాబోయే తరానికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతదేశం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రయాన్-3 విజయంతో యావత్ దేశం వేడుక చేసుకుంటుంది. దీని ద్వారా సైన్స్లో దేశ సత్తా చాటి చెప్పాం. ఇదంతా మన శాస్త్రవేత్తల సామర్థ్యంతో సాధ్యమైంది. దీని ఎఫెక్ట్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. జీ-20 విజయం భారత్ విజయం. ఇది ఏ వ్యక్తి లేదా పార్టీ విజయం కాదు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణం. గత 75 ఏళ్లలో స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన అనేక ఘటనలు ఈ సభలో జరిగాయన్నారు.