ByReddy Siddharth Reddy : టీడీపీలోకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ?
సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
- By CS Rao Published Date - 12:20 PM, Tue - 19 April 22
సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ కు హార్డ్ కోర్ అనుచరునిగా ఉన్న సిద్ధార్థరెడ్డి నిజంగా పార్టీ మారే అవకాశం ఉందా? అనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు యువకులు కలిసినప్పటికీ ఆయన పార్టీ మారే అంశమే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.
తొలి నుంచి తెలుగుదేశం పార్టీ అండ బైరెడ్డి కుటుంబానికి ఉంది. మూడుసార్లు బైరెడ్డి శేషశయనారెడ్డి ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలుపొందారు. కర్నూలు జిల్లా నందికొంట్కూర్ కేంద్రంగా బైరెడ్డి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాన్ని నడుపుతోంది. ఆయన వారసునిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ కుటుంబం తొలి నుంచి టీడీపీతోనే ఉండేది. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో 2012న రాజశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ఆనాడు చేపట్టారు. ఆయన సోదరుని కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యువనాయకునిగా కాలేజి నుంచి ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి 2018 వరకు సిద్ధార్థరెడ్డి పరోక్షంగా సేవలు అందించారు. బాబాయ్ రాజశేఖర్ రెడ్డికి అనుగుణంగా నడుస్తూ వచ్చారు.
2019 ఎన్నికల ముందు కుటుంబంలో నెలకొన్ని రాజకీయ పరిణామాల క్రమంలో వైఎస్ ఆర్ పార్టీలో సిద్ధార్థరెడ్డి చేరారు. నందికొట్కూర్ నియోజకవర్గం ఇంచార్జిగా కూడా పనిచేశారు. పార్టీని బలోపేతం ఎన్నికల నాటికి బలోపేతం చేశారు. కానీ, సామాజిక ఈక్వేషన్లు, స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేకపోయారు. అక్కడ నుంచి ఆర్థర్ కు వైసీపీ టిక్కెట్ దక్కింది. అతన్ని గెలిపించే బాధ్యతలను సిద్ధార్థరెడ్డి భుజస్కందాలపై జగన్ పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆర్థర్ ను గెలిపించడానికి శక్తివంచనలేకుండా పనిచేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆర్థర్, సిద్ధార్థ రెడ్డి మధ్య అంతర్గత పోరు పెరిగింది. ఒకానొక సమయంలో నేరుగా జగన్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా పంచాయతీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సిద్ధార్థరెడ్డికి క్యాబినెట్ ర్యాంకు ఉన్న శాప్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు.యువ లీడర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న సిద్ధార్థరెడ్డికి హోదా పెరగడంతో నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది. ఒక వైపు సోషల్ మీడియా క్రేజ్ తో పాటు వివిధ రకాల ప్రారంభోత్సవాలకు చురుగ్గా హాజరువుతున్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ అనూహ్యంగా పెరిగారు. సినిమా హీరోల కంటే సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలంటే యూత్ పెద్దఎత్తున ఎగబడుతున్నారు. అందుకే, కృష్ణా, విశాఖ జిల్లాల వ్యాపారులు కూడా సిద్ధార్థరెడ్డిని ఓపెనింగ్ లకు పిలిచే వాళ్లు. గుడివాడ ఎండ్ల పందెంకు కొడాలి నాని ఆహ్వానం మేరకు వచ్చిన సిద్ధార్థరెడ్డికి వచ్చిన క్రేజ్ అనూహ్యం. ఇలా రాష్ట్రా వ్యాప్తంగా ఫేమస్ యువ లీడర్ గా మారారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్థర్కు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా పరస్పరం వీధి పోరాటాలు చేసుకున్న వివాదాలు అనేకం. ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ను కర్నూలు జిల్లా వైసీపీ ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చక్కదిద్దారని కార్యకర్తలు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి దక్కిందని చెప్పుకుంటారు. ఆయన శ్యాప్ చైర్మన్ అయిన తరువాత ఆర్థర్ దాదాపుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినప్పటికీ ఉనికి కోల్పోయారు. పైగా సిద్ధార్థ రెడ్డి రాజకీయ నేపథ్యం, యువ లీడర్ గా ఉన్న క్రేజ్ ఆయన్ను ఆమాంతం పొలిటికల్ సెలబ్రిటీని చేసింది. మంత్రులు సైతం సిద్దార్థ రెడ్డి క్రేజ్ ను వాడుకునే ప్రయత్నం చేసిన సందర్భాలు లేకపోలేదు. సిద్ధార్థరెడ్డి క్రేజ్ ను గమనించిన వైసీపీ అధిష్టానం ఆయనపై నిఘా పెట్టింది. ఆయనకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్ ను ఇటీవల ప్రోత్సహించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని సిద్దార్థరెడ్డి వర్గం క్లోజ్ గా గమనించిందని టాక్. అందుకే, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధార్థరెడ్డి అన్వేషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చంద్రబాబు నేరుగా సిద్దార్థ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడని తెలుస్తోంది. ఆ తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, సిద్ధార్థ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని నందికొట్కూర్ కేంద్రంగా న్యూస్ గుప్పుమంటోంది. నందికొట్కూర్, శ్రీశైలం తో పాటు కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై పెత్తనం ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని టాక్. అందుకే, త్వరలో సిద్ధార్థరెడ్డి టీడీపీ గూటికి చేరతారని బలమైన ప్రచారం జరుగుతోంది.
ఏపీ సీఎం జగన్ కు వీరవిధేయునిగా ఉన్న సిద్ధార్థరెడ్డి పార్టీ మారే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ, రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉన్న సిద్ధార్థ రెడ్డికి వైసీపీలోని గ్రూప్ విభేదాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే నాలుగు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా లేరు. ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే ఆయన టీడీపీలోకి వెళతారనే ప్రచారానికి మద్ధతుగా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే నానుడి ప్రకారం సిద్ధార్థరెడ్డి టీడీపీలోకి మారినప్పటికీ ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు.
Related News
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.