Electrical Vehicle Park : ఓర్వకల్లులో ఎలక్ట్రికల్ వెహికల్ పార్కు
Electrical Vehicle Park : ఇప్పటికే అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా..తాజాగా మరో సంస్థ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది
- By Sudheer Published Date - 10:02 AM, Sat - 18 January 25

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పోటీపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లు ఏపీ వైపు చూడని సంస్థలు ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి రావడం తో అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా..తాజాగా మరో సంస్థ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు(Orvakal )లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ (Electric Vehicle Park) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ (People Tech Enterprises Pvt Ltd) సంస్థ ఒప్పందం చేసుకుంది.
Old Couple Love Marriage : వృద్ధాశ్రమంలో ప్రేమ పెళ్లి..ఆయనకు 64 , ఆమెకు 68
ఈ పార్కు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సూచించిన విధానాలను ప్రేరేపిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలకమైన దోహదం చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. 1200 ఎకరాల భూమిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, టెస్టింగ్ ట్రాక్స్, ఆర్. అండ్ డి కేంద్రాలు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయనున్నారు. పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టి.జి విశ్వప్రసాద్ మాట్లాడుతూ… ఈ పార్కు ద్వారా దేశంలో తొలి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్కుగా గుర్తించబడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు రూ. 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అలాగే 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పార్కు ఏర్పాటుతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల అభివృద్ధికి మరింత దోహదం అవుతుంది. ఈ పరిశ్రమ ప్రాంతంలో నూతన సాంకేతికతలు, మానవ వనరులు మరియు పరిశ్రమలకు సంబంధించిన అన్ని అంశాలు సమన్వయంతో వృద్ధి చెందగలవని విశ్వప్రసాద్ తెలిపారు.
ఏపీలో పరిశ్రమల స్థాపనకు అనువైన విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. పీపుల్ టెక్ సంస్థతో కుదిరిన ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి గొప్ప మైలు రాయి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ పార్కు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వంతో ప్రైవేట్ సంస్థలు కూడా కలిసి పనిచేసే విధానానికి దోహదంగా నిలుస్తుంది.