AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
- By Kode Mohan Sai Published Date - 01:01 PM, Wed - 20 November 24

AP Investments: రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసింది. “రీస్టార్ట్ ఏపీలో” భారీ పెట్టుబడులతో మొదటి అడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే, పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) తొలి సమావేశం ఈ నిర్ణయాలకు వేదికైంది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ.85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 33,966 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ:
ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్లో స్టీల్ ప్లాంట్ మరియు కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్టు అభివృద్ధి కోసం మిత్తల్ సంస్థ రూ.61,780 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 21 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొదటి దశ పనులను 2029 నాటికి పూర్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ (కేఎస్ఎస్ఎల్) రాష్ట్రంలో రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రూ.1,430 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పరిశ్రమ ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఈ పరిశ్రమకు అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత, గత ప్రభుత్వం ఆ సంస్థ ఉన్నతాధికారులకు కేసులు పెట్టి అరెస్టులు చేసిన తర్వాత, దక్షిణ కొరియా నుండి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడంపై భయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ప్రభుత్వ చర్చలు సఫలమవడంతో, రూ.5,001 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ.3,798 కోట్ల పెట్టుబడులతో 200 మందికి ఉపాధి కల్పించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్ల పెట్టుబడులతో 2,381 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.76 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేసి 250 మందికి ఉపాధి అందించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పీ రూ.50 కోట్ల పెట్టుబడులతో 2,000 మందికి ఉపాధి కల్పించనుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇంధన రంగంలో రూ.11,902 కోట్ల పెట్టుబడులు:
ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా రూ.8,240 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలలో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు 40 నెలల్లో పూర్తి చేసి, సుమారు 4 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని పేర్కొంది. అలాగే, కర్నూలు, నంద్యాల జిల్లాలలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1,725 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,662 కోట్ల పెట్టుబడితో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది, దీనివల్ల 350 మందికి ఉపాధి కల్పిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

Sipb Outcomes
పెట్టుబడులతో వచ్చేవారిని గౌరవిద్దాం:
దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని, ఆ పోటీలో భాగంగా ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు కష్టపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. “రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి గౌరవం ఇవ్వాలి. వారికి అన్ని రకాల సహకారం అందించాలి. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి” అని ఆయన చెప్పారు.
పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు మూడు విధాల భూసేకరణ విధానాలు చేపట్టాలని, రాజధాని అమరావతిలో చేపట్టిన భూసమీకరణ విధానాన్ని ప్రజల ముందుంచాలని సీఎం అన్నారు. రెండవ ఆప్షన్ కింద భూములు ఇచ్చే వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆ ప్రాజెక్టులో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. లేకపోతే అత్యుత్తమ ప్యాకేజీతో భూసేకరణ చేపట్టాలని అన్నారు. “పెట్టుబడులు ఎంత ముఖ్యం, భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్ కూడా అంతే ముఖ్యం” అని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, పి. నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్రసచివాలయంలో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్,ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు pic.twitter.com/549tzNgEaw
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 19, 2024