Bandi Srinivasa Rao : జగన్ తఢాఖా!ఉద్యోగుల ఉడత ఊపులు!!
ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేయడం ఉద్యోగులకు పరిపాటిగా మారింది.
- By CS Rao Published Date - 04:18 PM, Mon - 6 December 21
ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేయడం ఉద్యోగులకు పరిపాటిగా మారింది. `కూల్చడం..నిలబెట్టడం ..`మాకు తెలుసంటూ. ..సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వార్నింగ్ ఇవ్వడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 5శాతం ఉన్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చుతారంట..నిలబెడతారంట. ఇలాంటి మైండ్ గేమ్ ను కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగులు ప్లే చేస్తున్నారు. ప్రత్యేకించి చంద్రబాబుకు మా సత్తా ఏమిటో..తెలుసంటూ శ్రీనివాసరావు ప్రస్తావించడం గమనార్హం.చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో ఇష్టానుసారంగా అధికారాన్ని చాలా మంది ఉద్యోగులు చలాయించారు. అవినీతిని రెండంకెల స్థాయిని దాటించారు. అదేమంటే..కూల్చుతామంటూ ఆనాడు బాబును బెదించారు. భయపడిన చంద్రబాబు ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలను కాదనకుండా తీర్చాడు. సీన్ కట్ చేస్తే…23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ పరిమితం అయింది. మరి, ఉద్యోగులు ఆనాడు చంద్రబాబును ఎందుకు గెలిపించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డిని అయితే ఎక్కువగా బెదిరించొచ్చని అందలం ఎక్కించారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అందరిలాంటి వాడు కాదు. ఎప్పటికప్పుడు ప్రజానాడిని పట్టేసే నైపుణ్యం ఆయనకు ఉంది. అందుకు సంబంధించి సమాచారం సేకరించే వ్యవస్థ కూడా ఉంది. ఉద్యోగుల పట్ల ప్రజలు ఏహ్యభావంతో ఉన్నారనే విషయం జగన్ కు తెలుసు. మొత్తం బడ్జెట్ లో 60శాతం జీతాలకు వెళుతున్నప్పటికీ సామాన్యులకు సేవ చేయాలంటే లంచం డిమాండ్ చేసే ఉద్యోగులే ఎక్కువ. అందుకే, ఉద్యోగులపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని జగన్ వద్ద సమాచారం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఉద్యోగుల అవినీతికి వ్యతిరేకంగా ఎజెండాను తయారు చేయాలని భావిస్తున్నారట. ఆ విషయాన్ని పీకే టీం అక్కడక్కడ లీకులు ఇచ్చిందని టాక్.ప్రజా సేవలకులం అనే విషయాన్ని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల మరచిపోయి వ్యవహరిస్తుంటారు. సామాన్యులకు అతీతులమనే భావాన్ని కలిగి ఉంటారు. అందుకే, పేదవాడు వాళ్ల వద్దకు వెళితే..కనీసం సమాధానం కూడా చెప్పని అవినీతికోరులు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల అంతు చూడ్డానికి 14400 టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే వచ్చిన కాల్స్ లక్షల్లో ఉన్నాయట. అందుకే, ఇప్పుడు సామాన్యుల పక్షాన నిలబడితే..వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవచ్చని జగన్ ఆలోచనట.
ఉదయం 10.30 గంటలలోపు ఆఫీసుల్లో అందరూ అందుబాటులో ఉండాలని 2004కు ముందు చంద్రబాబు సీఎం హోదాలో ఉద్యోగులకు హుకుం జారీ చేశాడు. కానీ, అది సాధ్య పడలేదు. ఆ తరువాత బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ కార్యారూపంలోకి తీసుకురాలేకపోయాడు. స్వర్గీయ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కనీసం 11 గంటల లోపు అందరూ సీట్లలో ఉండాలని కోరాడు. బయో మెట్రిక్ పెట్టాలని ఆలోచించిన ఆయన ఉద్యోగుల వాలకం చూసి యూటర్న్ తీసుకున్నాడు. బలమైన సీఎంలుగా ఉన్న చంద్రబాబు, వైఎస్ హయాంలోనే ఉద్యోగుల విధులను గాడిలో పెట్టలేకపోయారు. అవినీతిని అరకట్టలేక పోయారు.రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఉద్యోగులు చాలా మంది అడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరించారు. హైదరాబాద్ నుంచి ఉచిత బస్సు, రైలు ప్రయాణాలను అనుభవిస్తున్నారు. డబుల్ డీఏలను తీసుకుంటున్నారు. ఉచిత భోజనం, విజయవాడలో ఉండడానికి గృహ వసతులను తీసుకున్నారు. ఇవన్నీ చంద్రబాబు తీర్చిన గొంతమ్మె కోర్కెలు. అయినప్పటికీ ఆయన 2019లో ఓడిపోయారు. 13 లక్షల మంది ఉద్యోగులు వాళ్ల కుటుంబీకులు 60లక్షల మంది ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రతిగా ప్రజలు కూడా ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చే రోజులను తీసుకురావాలని జగన్ భావిస్తున్నాడట. ఉద్యోగుల అవినీతి వర్సెస్ సామాన్య ప్రజలు.. నినాదంతోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తుందట. ప్రజలు గెలుస్తారా? ఉద్యోగులు గెలుస్తారా? అనే కోణం నుంచి ఎన్నికల ప్రచారాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇదే నిజమైతే..ఉద్యోగుల ఆటలకు ఇక సెలవ్.!
Related News
YS Sharmila : జగన్తో షర్మిల మళ్లీ పోరాటం..!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దాడులు చేస్తూనే, అకృత్యాలను బయటపెడుతూనే ఉన్నారు.