Iran పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత దేశ నౌకలకు హార్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా తమ మిత్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాక్లకు కూడా ఈ అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. దీంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత నౌకలు త్వరలోనే సరుకుతో సహా తమ గమ్యస్థానాలకు చేరేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది. తమ మిత్ర దేశాలైన భారత్ సహా ఐదు దేశాల నౌకల రాకపోకల కోసం ఈ మార్గాన్ని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.
మిత్ర దేశాలకు ప్రత్యేక అనుమతులు..
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సదరు జలసంధిని మూసివేసి కొన్ని దేశాల నౌకలను వెళ్లనీయకుండా అడ్డుకుంటోంది. అయితే తాజాగా భారత్తో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్లకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. “మా మిత్ర దేశాల నౌకలు హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం” అని అరాగ్చీ పేర్కొన్నట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు తెలిపింది.
చిక్కుకుపోయిన భారత నౌకలకు మార్గం సుగమం..
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన భారత వాణిజ్య నౌకలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు మార్గం సులువైంది. ముఖ్యంగా భారత్కు వస్తున్న ఐదు గ్యాస్ ట్యాంకర్లు అనుమతుల కోసం గత కొంతకాలంగా వేచి చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా ఉత్తర్వులతో ఈ ట్యాంకర్లు సురక్షితంగా భారత్ చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయంగా ఇంధన సరఫరాలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
హార్మూజ్ దాటే నౌకలపై టోల్ రుసుము విధించే అవకాశం
మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ రుసుము విధించే అంశంపై ఇరాన్ పార్లమెంట్ కసరత్తు చేస్తోంది. ‘బ్లూమ్బెర్గ్’ కథనం ప్రకారం.. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నౌకల నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు దానికి బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ రక్షణ కల్పిస్తూ జలసంధిని దాటించనుంది. సముద్రపు దొంగల ముప్పు లేదా ఇతర అంతర్జాతీయ ఉద్రిక్తతల నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు ఇరాన్ ఈ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనుంది. మరి ఏ దేశాలకైనా వెసులుబాటు కల్పిస్తుందా.. లేక అన్ని దేశాల నౌకలపై ఈ టోల్ రుసుము వసూలు చేస్తుందా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
