మహేంద్ర సింగ్ ధోనీ ఆన్ ది ఫీల్డ్ లో ఉన్నా…ఆఫ్ ది ఫీల్డ్ లో ఉన్నా తన ప్రత్యేకత నిలుపుకుంటాడు. ఎవరేమనుకున్నా తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. తనకు ఇష్టమైన పనులు చేయడానికి ఏమాత్రం మొహమాటపడడు. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే అతని ఇంట్లో చాలా పెంపుడు జంతువులే కనిపిస్తాయి. గుర్రాలు, కుక్కలు, చిలుకలు, ఇలా.. రకారకాల జంతువులను పెంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ లిస్ట్లో మేకలు కూడా చేరాయి. ధోనీ ఇంటికి రెండు మేకలు తీసుకొచ్చాడంటూ అతని భార్య సాక్షి ధోనీ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సమ్బడీ లవ్స్ యూ అనే సాంగ్తో ఆమె ఈ మేకల వీడియోనును షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ ఇంట్లో మొత్తానికి గోట్స్ వచ్చాయంటూ చాలా మంది యూజర్లు కామెంట్ చేశారు.
గతంలో ధోనీ తన ఇంట్లో ఉన్న గుర్రం వీడియోను కూడా షేర్ చేసాడు. ఇక తన కూతురు జివా బర్త్డే సందర్భంగా ఆమెకు కూడా మరో చిన్న గుర్రాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇవే కాకుండా ధోనీ కడక్నాథ్ కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నాడు. దీనికోసం ఈ మధ్యే అతడు పెద్ద ఎత్తున ఈ కోళ్ల కోసం ఆర్డర్ ఇచ్చాడు. సేంద్రీయ వ్యవసాయంపై ఎంతో ఇష్టం ఉన్న మహి తన ఫామ్ హౌస్ లో ఆ పద్ధతులే పాటిస్తున్నాడు.
ధోనీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నా.. సాక్షి ధోనీ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటోంది. తరచూ తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ధోనీ ఫ్యాన్స్ అంతా సాక్షి ఇన్స్టా అకౌంట్ను ఫాలో అవుతుంటారు. ఇక ధోనీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం ఐపీఎల్లోనే ఆడుతున్నాడు.