Mukesh Choudhary: ఐపీఎల్ 2026 ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముకేష్ చౌదరిని తీరని లోటు వేధిస్తోంది. ముకేష్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించింది. ముకేష్కు మద్దతుగా ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ముకేష్ తల్లి మరణంతో ముంబై ఇండియన్స్తో జరగబోయే కీలక మ్యాచ్కు దూరం కానున్నాడు.
సొంతూరికి బయలుదేరిన ముకేష్
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ముకేష్ చౌదరి జట్టును వీడి తన సొంత ఊరు రాజస్థాన్లోని భిల్వారాకు బయలుదేరారు. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లడంతో ముంబైతో జరిగే మ్యాచ్లో అందుబాటులో ఉండడు.
Also Read: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్షీల్డ్ పగిలితే ఏం చేయాలి?
సీఎస్కే సంతాపం
ముకేష్ చౌదరి మాతృమూర్తి మరణం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ సంతాపం వ్యక్తం చేసింది. “ముకేష్ చౌదరి తల్లి మరణం పట్ల సీఎస్కే కుటుంబం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ కష్టకాలంలో మేము ముకేష్, అతని కుటుంబానికి అండగా ఉంటాము. మా ప్రార్థనల్లో వారి కుటుంబానికి స్థానం ఉంటుంది” అని ఫ్రాంచైజీ పేర్కొంది.
ఈ సీజన్ ప్రదర్శన
ముకేష్ చౌదరి ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆ మ్యాచ్లో ఆయన అద్భుతంగా రాణించి, 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఐపీఎల్లోకి ప్రవేశించాడు ముకేష్. ఇప్పటివరకు 17 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీశాడు. 28.57 సగటుతో రాణించాడు.
రిటెన్షన్, తదుపరి అవకాశం
ఐపీఎల్ 2026 వేలానికి ముందే సీఎస్కే ముకేష్ చౌదరిని రిటైన్ చేసుకుంది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ స్థానంలో అతనికి అవకాశం లభించింది. ఇప్పుడు ముకేష్ జట్టుకు దూరం కావడంతో ముంబైతో జరగబోయే మ్యాచ్లో గుర్జప్నీత్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది.
