Jammu Kashmir State Again : జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర సర్కారు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను కొనసాగించింది. 12వ రోజు (మంగళవారం) కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదోపవాదనలు జరిగాయి. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించు కున్నారు. జమ్మూ కశ్మీర్ ను కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది తాత్కాలిక చర్య మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించగానే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
అయితే ఎప్పటిలోగా కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తారో తెలియజేయాలని (Jammu Kashmir State Again) కేంద్ర ప్రభుత్వాన్ని ఈసందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఏదైనా రోడ్ మ్యాప్ ఉంటే బహిర్గతం చేయాలని నిర్దేశించింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ముందుకు సాగుతోందని, ఎన్నికలు తప్పకుండా నిర్వహిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం సూచించింది.