విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీస్తామని తెలిపారు.
బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వం తమ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసులో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం గాదె విజయలక్ష్మి మాట్లాడుతూ.. తన కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని విజయలక్ష్మి వెల్లడించారు.
