రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) శనివారం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించి మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో అధికారికంగా నాయకత్వ మార్పుకు మార్గం సుగమమైంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు సిద్దరామయ్య కొనసాగుతారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్న సీఎల్పీ సమావేశంలో ముందుగా సిద్దరామయ్య సేవలను ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదించి, అనంతరం డీకే శివకుమార్ను కొత్త శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హాజరుకానున్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలతో సిద్దరామయ్య, శివకుమార్ విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం ఇద్దరూ బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా.. డీకే శివకుమార్ ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై అనధికారికంగా సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని పలువురు ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే వారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తొలి దశలో 5 నుంచి 10 మంది మంత్రులతో చిన్న మంత్రివర్గం ఏర్పడి, అనంతరం విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మే 31, జూన్ 1 లేదా జూన్ 5 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమానికి హాజరయ్యే కాంగ్రెస్ సీనియర్ నేతల అందుబాటు ఆధారంగా తుది తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమతుల్యత కోసం ఓబీసీ, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన నేతకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిద్దరామయ్య రాజీనామా అనంతరం స్పందించిన శివకుమార్.. ఆయనను పార్టీకి బలమైన పునాది అంటూ కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన మార్గదర్శకత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు అనుకున్నట్లే జరిగితే కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పు చోటుచేసుకున్న రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
