దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పిస్తుందని.. రోడ్లపై నమాజ్ చేయడం తప్పు అనుకుంటే, రోడ్లపై జరిగే ప్రతి మతపరమైన కార్యక్రమం కూడా తప్పేనని అంగీకరించాలన్నారు. ఒక మతానికి చెందిన పండుగల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని కోరుతున్నవారు.. రంజాన్ నెలలో 30 రోజుల పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని డిమాండ్ చేయాలన్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వరకు జరిగే భారీ మత యాత్రల వల్ల రోడ్లు మూసివేయబడుతున్నా వాటిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని, కానీ ముస్లింల నమాజ్పై మాత్రం విమర్శలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
నీట్ పేపర్ లీక్, మహిళలపై పెరుగుతున్న నేరాలు వంటి ముఖ్యమైన సమస్యలను పక్కనబెట్టి, ముస్లింలకు సంబంధించిన అంశాలనే కొన్ని టీవీ ఛానెళ్లు ప్రధానంగా ప్రసారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అస్సాంలో అమలవుతున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై కూడా ఒవైసీ విమర్శలు గుప్పించారు. హిందూ వివాహ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను ముస్లింలపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. ముస్లింల మాంసాహార అలవాట్లను ప్రతికూలంగా చూపించే ప్రయత్నాలను ఖండించిన ఆయన, భారతీయ చరిత్రలో మాంసాహారం ప్రస్తావనలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశం ముస్లింలకూ చెందుతుందని.. తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని ఓవైసీ తెలిపారు. తమ మత స్వేచ్ఛను ఎవరూ హరించలేరని ఓవైసీ స్పష్టం చేశారు.
