బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్నెఫ్ట్, లుకాయిల్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. వీటి అనుబంధ సంస్థలపై కూడా ఇవే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ రెండు కంపెనీలు.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముదిరేందుకు నిధులు అందిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. యుద్ధాన్ని ముగించేందుకు మరిన్ని చర్యలకు కూడా సిద్ధమేనని ప్రకటించింది. ఇదే సమయంలో ఐరోపా కూటమి కూడా రష్యాపై ఆంక్షల్ని విధించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి ఆజ్యం పోసుకున్నాయి. ఇటీవల పరిస్థితులు.. కాస్త కుదుటపడినట్లే కనిపించినా అలా జరగలేదు. అమెరికా తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని.. తాము దీనికి లొంగబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా చర్యల వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని.. ఇది అందరు వినియోగదారులపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4120 డాలర్లపై ఉంది. కిందటి రోజు ఇది 4100 డాలర్ల దిగువన ఉండేది. సిల్వర్ రేటు కూడా 49 డాలర్లకు చేరువైంది.
దేశీయంగా కూడా బంగారం రేట్లు ఇటీవల భారీగా తగ్గి ఉపశమనం కల్పించగా.. ఇవాళ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 350 పెరగ్గా తులం రూ. 1,15,000 కు చేరింది. గత 6 రోజుల్లో ఇది రూ. 7050 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలోనే హైదరాబాద్లోని ప్రముఖ జువెల్లరీల్లో బంగారు ఆభరణాల ధర ఎంత ఉందో తెలుసుకుందాం. లలితా జువెల్లరీ లిమిటెడ్లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై గ్రాముకు రూ. 11,500 పలుకుతోంది. తనిష్క్లో కాస్త ఎక్కువగా గ్రాము గోల్డ్ రేటు రూ. 11,505 గా ఉంది. కల్యాణ్ జువెల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖజానా జువెల్లర్స్లో కూడా గ్రాము బంగారం ధర రూ. 11,500 గా ఉంది. ఆభరణాలు తీసుకునేటప్పుడు వీటిపై మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఇంకా.. 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూఎస్ ఫెడ్ వచ్చే వారం కీలక వడ్డీ రేట్లను మరో 25 శాతం మేర తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి.
