Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. కీలకంగా మారిన పెంపుడు శునకం చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో […]

Published By: HashtagU Telugu Desk
The day the Tuni girl went missing... a major twist in the CCTV footage.

The day the Tuni girl went missing... a major twist in the CCTV footage.

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

కీలకంగా మారిన పెంపుడు శునకం
చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో పాటే ఉన్న పెంపుడు శునకం కూడా అదృశ్యమైంది. తాజాగా పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్‌లో కీలకమైన దృశ్యాలు లభ్యమయ్యాయి. జూన్ 6న మధ్యాహ్నం 1:02 గంటల సమయంలో ఆ శునకం గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఆలయం వద్ద తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత లేదు. అయితే, మూడు రోజుల తర్వాత జూన్ 9న ఆ కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. ఆశ్చర్యకరంగా, అది చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరోవైపు నుంచి రావడం గమనార్హం. ఆ శునకం సహాయంతో పాప జాడ కనుగొనేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ఆ కుక్క కూడా మరణించడంతో పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
చిన్నారి ఆచూకీ కనుగొనడంలో అన్ని మార్గాలూ అన్వేషిస్తున్న పోలీసులు, కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. అటవీ ప్రాంతంలో జీడి పిక్కల సేకరణకు, చిన్న జంతువుల వేటకు వచ్చి వెళ్లే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితుల మొబైల్ నంబర్ల డేటాను విశ్లేషిస్తూ వారి కదలికలపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు, అటవీ జంతువుల దాడి కోణంలోనూ అనుమానాలున్న నేపథ్యంలో పోలీసులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చిన్నారి చివరిసారిగా కనిపించిన కొండ ప్రాంతంలోని ఇనుప కంచెకు రెండు బొమ్మలు కట్టి, వాటిలో మాంసం ఉంచారు. మాంసం వాసనకు కొండచిలువ వంటి జంతువులు ఏవైనా ఆకర్షితమై వస్తాయేమోనని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సమీపంలోని కొండపై క్రూర మృగాల సంచారం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.

నకిలీ జ్యోతిష్యుడి అరెస్ట్
ఈ విషాదకర పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి, తాను జ్యోతిష్యుడినని చెప్పుకుంటూ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించాడు. పాప ఆచూకీపై వారిని మరింత భయాందోళనలకు గురిచేసేలా మాట్లాడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వందలాది మంది గ్రామస్థులు, ప్రత్యేక బృందాలు సమీపంలోని చెరువులు, బావుల్లో గాలించినా చిన్నారి జాడ తెలియకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

  Last Updated: 19 Jun 2026, 11:10 AM IST