Raitu Bharosa Scheme : తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసే ప్రక్రియను నిలుపుదల చేసింది. ఈనెల 13న రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తర్వాతే సాయాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఓ మెమొరాండంను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి అమలుపై సాయంత్రంకల్లా రిపోర్టు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఈసీ ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
రైతుభరోసా పథకాన్ని ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకంగా భావించి తాము అనుమతి ఇచ్చామని ఈసీ చెప్పింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పలు బహిరంగసభల్లో ప్రసంగిస్తూ.. మే 9వ తేదీకల్లా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇలా బహిరంగంగా హామీ ఇవ్వడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఈసీ పేర్కొంది.
రైతుభరోసా స్కీమ్ ద్వారా పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్లపై ఎన్.వేణుకుమార్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చామని.. అయితే నాటి రాష్ట్ర మంత్రి హరీశ్రావు పలు సభల్లో బహిరంగంగా దీని గురించి ప్రస్తావించడంతో నవంబరు 27 నుంచి అనుమతిని ఉపసంహరించారు.
ఐదు ఎకరాలకు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియను కూడా చేపట్టింది. దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు భావించారు. అయితే ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది.