తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
తారామతి బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్కుషా గెస్ట్హౌస్లను ఆధునికీకరించాలని చెప్పారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలని, అక్కడి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి యాదాద్రి తరహాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పర్యావరణహిత పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ ‘క్యూర్’ పరిధిలోని అటవీ భూములను ‘ఎకో టూరిజం’ కింద అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.
పాతబస్తీలోని చారిత్రక పురానాపూల్ వంతెనను ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే అక్కడి ట్రాఫిక్ను మళ్లించి పర్యాటక జోన్గా మార్చాలని అధికారులకు తెలిపారు.
