తెలంగాణ సంస్కృతి, కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి కేంద్రమైన ములుగు జిల్లాలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని పురాతన చారిత్రక శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా (National Monument Status) గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను, దాని పరిధిని ఇకపై “జాతీయ సంపద”గా పరిగణించనున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలోని జగత్ప్రసిద్ధ ‘రామప్ప దేవాలయం’ యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా అంతర్జాతీయ గుర్తింపు పొంది ప్రపంచ పటంలో నిలవగా, ఇప్పుడు అదే గ్రామంలోని మరో శివాలయానికి జాతీయ హోదా దక్కడం విశేషం.
కేంద్ర సాంస్కృతిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో పాలంపేట శివాలయానికి మహోన్నత దశ పట్టనుంది. జాతీయ స్మారక కట్టడంగా గుర్తింపు పొందినందున, ఈ ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను సుందరీకరించడంతో పాటు భక్తులు, పర్యాటకులకు అవసరమైన అత్యాధునిక వసతులను కల్పించనున్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ శివాలయం కూడా మరొక ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఈ గుర్తింపు పట్ల స్థానిక ప్రజలు, చరిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
