Site icon HashtagU Telugu

Hyderabad : పరువు హత్య కేసులో 10 మంది అరెస్ట్

Murder

Murder

పరువు హత్యగా అనుమానిస్తున్న డీజే ఆపరేటర్ దేవరకొండ హరీశ్‌కుమార్ (28) హత్య కేసులో పది మందిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బి. దీంధయాల్ (22), టి. నరేష్ (20), పి.వెంకటేష్ గౌడ్ (20), కె. రోహిత్ సింగ్ (20), జి. అక్షయ్ కుమార్ (22), పి. అనికేత్ (21), కోయల్కర్ మనీష్ (23), బూరే సాయినాథ్ (21), మాతంగి రాజేంద్ర కుమార్ (25), గౌతీనవనితల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మ‌రో నిందితుడు బి వెంకట్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హ‌రీష్ కుమార్, ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలని యోచిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హరీష్‌తో చాటింగ్ చేయడాన్ని గమనించిన బాలిక సోదరుడు దీనదయాళ్ ఆమెను తిట్టి, హెచ్చరించాడు. అయితే ఆ హెచ్చరికను పట్టించుకోకుండా, ఆమె అతనితో చాట్ చేస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో పారిపోయి వివాహం చేసుకోవాలని యువ‌తి ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 22న కుమార్‌తో కలిసి పారిపోయిందని పేట్‌బషీరాబాద్‌ సీఐ గౌరీ ప్రశాంత్‌ తెలిపారు. మిత్రుడు రాజేంద్రకుమార్ సహాయంతో పేట్‌బషీరాబాద్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నారు. ఈ విషయం యువ‌తి సోద‌రుడు దీనదయాళ్‌కి తెలిసింది. రాజేంద్రను బెదిరించడంతో హ‌రీష్ కుమార్‌, యువ‌తి ఉన్న ప్ర‌దేశాన్ని దీన‌ద‌యాళ్ గుర్తించాడు. మార్చి 1న, దీనదయాళ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి రాజేంద్ర వద్దకు వెళ్లాడు. హ‌రీష్‌, యువ‌తి ఉన్న చోటుకి దీనద‌యాళ్ బృందాన్ని రాజేంద్ర తీసుకెళ్లాడు. అక్క‌డ హ‌రీష్‌ని, యువ‌తిని ప‌ట్టుకున్న దీన‌ద‌యాళ్ ..యువ‌తిని బైక్‌పై ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ త‌రువాత హ‌రీష్‌ని క‌త్తుల‌తో పొడిచి చంపేసి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. ప‌రువు హ‌త్య‌గా భావించిన పోలీసులు ప‌ది మందిని అరెస్ట్ చేశారు.