ఐపీఎల్ (IPL-2023) 7వ మ్యాచ్లో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Vs Gujarat Titans) ముఖాముఖిగా తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు విజయాల పరంపరను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది.
గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సీజన్లో ఢిల్లీ కమాండ్ డేవిడ్ వార్నర్ చేతిలో ఉంది. తొలి విజయం తర్వాత గుజరాత్కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి బయలుదేరాడు. తొలి మ్యాచ్లోనే విలియమ్సన్ మోకాలికి గాయమైంది. అయితే ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినా గుజరాత్ జట్టు చాలా బలంగా ఉంది.
Also Read: Kolkata Knight Riders: కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం
గత మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్లు ఢిల్లీని చాలా నిరాశపరిచారు. అన్రిచ్ నోర్ట్జే లేకపోవడంతో ఢిల్లీ బౌలర్లు లక్నో బ్యాట్స్మెన్ను నిలువరించలేకపోయారు. బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ఢిల్లీకి తలనొప్పిగా మారింది. గత మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి పేలవమైన ఫీల్డింగ్ ప్రధాన కారణంగా మారింది. కైల్ మేయర్స్ క్యాచ్ను ఖలీల్ జారవిడిచాడు. ఆ తర్వాత మేయర్స్ 73 పరుగులు చేశాడు. గత సీజన్లో ఇరు జట్లు ఒకే మ్యాచ్ లో తలపడగా గుజరాత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ 84 పరుగులతో అదరగొట్టాడు. ఇప్పటికీ అదే ఫామ్లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో చెన్నైపై 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గుజరాత్ విజయపరంపరను నిలబెట్టుకుంటుందా లేక ఢిల్లీ విజయ ఖాతా తెరవగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నేడు ఢిల్లీ మ్యాచ్ వీక్షించనున్న పంత్
ఐపీఎల్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్కు తమ రెగ్యులర్ కెప్టెన్ పంత్ ను తీసుకొచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తోంది.అతడు ఫ్రాంఛైజీ యజమానుల ప్రాంతం నుంచి మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో పంత్ ఐపీఎల్కు దూరమయ్యాడు. అయితే ఢిల్లీ తమ తొలి మ్యాచ్ సందర్భంగా పంత్ జెర్సీని డగౌట్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.