Site icon HashtagU Telugu

Virat Kohli: నాకు మాట‌లు రావ‌డం లేదు.. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విరాట్ కోహ్లీ విచారం!

Bengaluru Stampede

Bengaluru Stampede

Virat Kohli: మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. టైటిల్ విజయం తర్వాత ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో విజ‌యం అభిమానులతో పంచుకోవ‌డానికి బెంగళూరుకు చేరుకుంది. దీంతో స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్‌సీబీ జట్టు అతిపెద్ద ఆట‌గాడు విరాట్ కోహ్లీ (Virat Kohli), అతని భార్య అనుష్క శర్మ త‌మ స్పందనల‌ను వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందన

ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు. అతను ఆర్‌సీబీ జట్టు అధికారిక ప్రకటనను షేర్ చేస్తూ.. ‘నాకు మాటలు కూడా రావ‌టం లేదు. పూర్తిగా విచారంలో ఉన్నాను’ అని రాసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత అతని భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ కూడా ఆర్‌సీబీ జట్టు పోస్ట్‌ను షేర్ చేస్తూ మూడు బద్దలైన హృదయ ఎమోజీలను పోస్ట్ చేసింది. 18 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీ జ‌ట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.

Also Read: Nails Changing Color : మీ గోళ్ల రంగు మారుతోందా..? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..!!

ఆర్‌సీబీ అధికారిక ప్రకటన ఏమిటి?

ఈ దుఃఖకర ఘటనపై తమ మొదటి స్పందనను వ్యక్తం చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇలా పేర్కొంది. ‘మీడియా నివేదికల ద్వారా తెలిసిన దురదృష్టకర సంఘటనలతో మేము చాలా బాధపడ్డాము. ఈ రోజు మధ్యాహ్నం జట్టు రాకపై బెంగళూరు అంతటా జనం గుమిగూడినట్లు తెలిసింది. అందరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఆర్‌సీబీ ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేస్తుంది. ప్రభావిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తుంది. పరిస్థితి గురించి తెలిసిన వెంటనే మేము మా కార్యక్రమంలో వెంటనే సవరణలు చేశాం. స్థానిక అధికారుల సలహా, మార్గదర్శకత్వాన్ని అనుసరించాము. మా అభిమానులందరినీ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము’ అని రాసుకొచ్చింది.