Ganguly Warns Gambhir: గౌతమ్ గంభీర్ ఇటీవల రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి భారతీయ కోచ్గా చరిత్ర సృష్టించారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు టీ20 వరల్డ్ కప్ 2026 టైటిళ్లను కైవసం చేసుకుంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు సరైన సమయంలో ఫామ్లోకి వచ్చి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. అయితే భారత దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం గంభీర్కు ఒక హెచ్చరిక చేశారు. గంభీర్ ‘అసలు పరీక్ష’ ఇంకా ఏడాది కంటే ఎక్కువే దూరంలో ఉందని, అది 2027 వన్డే వరల్డ్ కప్ రూపంలో ఎదురుకానుందని ఆయన పేర్కొన్నారు.
‘ఆఫ్రికాలో అసలైన పరీక్ష’
బోరియా మజుందార్తో జరిగిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. వైట్ బాల్ క్రికెట్లో గంభీర్కు అసలైన పరీక్ష 2027లో దక్షిణాఫ్రికాలో ఎదురవుతుంది. అక్కడ ఉండే పరిస్థితులు ఆయన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. కానీ తన వద్ద ఉన్న జట్టుతో ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు. 2023 క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, చివరి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read: శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!
‘టెస్టుల్లో మెరుగుదల అవసరం’
టెస్ట్ క్రికెట్లో గంభీర్, టీమ్ ఇండియా తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు. “రెడ్ బాల్ క్రికెట్లో వారు ఇంకా మెరుగ్గా రాణించాలి. దీనికి ఉత్తమ మార్గం పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే. పిచ్ ఎలా ఉంటుందో అనే ఆందోళనను పూర్తిగా వదిలేయాలి. ఉదాహరణకు, ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్నే తీసుకోండి. ఆ సిరీస్లో పిచ్ ఎలా ఉన్నా ఫలితం అనుకూలంగా వచ్చింది. స్వదేశంలో మరీ ఎక్కువగా టర్న్ అయ్యే పిచ్లపై ఆడాల్సిన అవసరం లేదు. మంచి పిచ్లపైనే మంచి ఫలితాలు వస్తాయి” అని గంగూలీ సూచించారు.
గంభీర్కు ‘దాదా’ మద్దతు
గౌతమ్ గంభీర్కు తన పూర్తి మద్దతును గంగూలీ ప్రకటించారు. “గౌతమ్ అద్భుతమైన కోచ్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందే నేను చెప్పాను.. ఈయనకు కొంచెం సమయం ఇవ్వాలని. వైట్ బాల్ క్రికెట్లో ఆయన చాలా గొప్ప కోచ్, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో. ఆయన దగ్గర మంచి టీమ్ ఉంది. ఆయన కూడా సమర్థుడైన కోచ్” అని కొనియాడారు.
