సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కోల్‌కతాపై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Suryavanshi

Suryavanshi

Suryavanshi: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ శివతాండవం చేసింది. ఐపీఎల్ 2026లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఈ సీజన్ మొత్తం తన బ్యాటింగ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అతను స్పష్టం చేశాడు. కేవలం 15 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్ధశతకం. 305 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు చేసి చెన్నైపై మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

సూర్యవంశీ చారిత్రాత్మక ఇన్నింగ్స్

ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026ని కూడా అదే జోరుతో ప్రారంభించాడు. చెన్నై బౌలర్లపై మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ అప్పటికే రాజస్థాన్ జట్టును గెలుపు ముంగిట నిలిపాడు.

Also Read: పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కోల్‌కతాపై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు వైభవ్ చేసిన ఈ 15 బంతుల అర్ధశతకం ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. మూడవ స్థానంలో కూడా వైభవ్ పేరే ఉండటం విశేషం. 2025లో గుజరాత్‌పై అతను 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

కేవలం 127 పరుగులకే కుప్పకూలిన CSK

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. కేవలం 19 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. ఒక దశలో 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సీఎస్కే తరపున జేమీ ఓవర్టన్ అత్యధికంగా 36 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివరికి చెన్నై జట్టు 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తలో 2 వికెట్లు తీశారు.

  Last Updated: 30 Mar 2026, 10:34 PM IST