Site icon HashtagU Telugu

India vs Sri Lanka: శ్రీలంకపై భారత్‌ ఘన విజయం.. 82 ప‌రుగుల తేడాతో గెలుపు!

India vs Sri Lanka

India vs Sri Lanka

India vs Sri Lanka: మహిళల టీ20 ప్రపంచ క‌ప్‌లో భార‌త్ మ‌హిళల జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజయం న‌మోదు చేసింది. శ్రీలంతో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో భార‌త్ (India vs Sri Lanka) జ‌ట్టు 82 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ జ‌ట్టు 3 వికెట్ల నష్టానికి 172 ప‌రుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్‌లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 27 బంతుల్లో అజేయంగా 52 ప‌రుగులు చేయ‌గా.. స్మృతి మంధాన 50 ప‌రుగులు చేసి ఔటైంది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 90 పరుగులకే (19.5 ఓవర్ల వద్ద) భార‌త్ జ‌ట్టు ఆలౌట్‌ చేసింది. లంక బ్యాటింగ్‌లో కవిశా(21), అనుష్క(20), కాంచన(19) మినహా ఎవరూ రాణించలేదు. భారత్‌ బౌలర్లలో ఆశ 3, అరుంధతి 3, రేణుక 2 వికెట్లు తీశారు. శ్రేయాంక, దీప్తి చెరో వికెట్‌ పడగొట్టారు. దీంతో భార‌త్ జ‌ట్టు ఆడిన మూడో మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంది.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించింది. తుఫాను శైలిలో బ్యాటింగ్ చేసిన హర్మన్ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది. ఇది T20 ప్రపంచ కప్‌లో భారత్‌కు వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. స్మృతి మంధాన ఆరేళ్ల రికార్డును హర్మన్‌ప్రీత్ బద్దలు కొట్టింది. ఆమె త‌న ఇన్నింగ్స్‌లో 192 స్ట్రైక్ రేట్‌తో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. హర్మన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు స్కోరు బోర్డులో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Also Read: T20 Series : జోరు తగ్గని యువభారత్..టీ20 సిరీస్ కైవసం

హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీ

హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరంభం నుండి అద్భుతమైన ఫామ్‌లో కనిపించి చాలా ఫోర్లు కొట్టింది. హర్మన్ పేలుడుగా బ్యాటింగ్‌కు శ్రీలంక బౌలర్ల నిల‌వ‌లేక‌పోయారు. భారత కెప్టెన్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేయడంతో పాటు ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేసుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 2018 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై 31 బంతుల్లో ఫిఫ్టీ చేసిన స్మృతి మంధాన T-20 ప్రపంచ కప్ చరిత్రలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.

భారత జట్టు సెమీ ఫైనల్ ఆశలు సజీవం

T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టు శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సింది. శ్రీలంకను ఓడించడంతో పాటు లీగ్ దశలోని చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం ఆస్ట్రేలియాను కూడా ఓడించాలి. అయితే తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ జట్టు 82 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దీంతో జట్టు సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. కాగా, రెండో మ్యాచ్‌లో జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.