Abhishek Sharma: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన తీరు చూసి అసలు జట్టులో అతని స్థానంపైనే ప్రశ్నలు తలెత్తాయి. అయినప్పటికీ భారత టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి అండగా నిలిచింది. దీని ఫలితం ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియాకు దక్కింది. ఫైనల్లో సంజూ శాంసన్తో కలిసి అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన
వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో అద్భుతంగా పునరాగమనం చేసి కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 247.62 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్ తన ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. సరిగ్గా ఇలాంటి సీన్ 2024 టీ20 వరల్డ్ కప్లో కూడా కనిపించింది. అప్పుడు టోర్నమెంట్ అంతా విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోయినా, ఫైనల్లో మాత్రం 76 పరుగులు చేసి భారత్ను ఛాంపియన్గా నిలిపారు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అదే తరహాలో రాణించి తన విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించిన శాంసన్!
టీమ్ ఇండియా కొండంత స్కోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ శర్మకు తోడుగా సంజూ శామ్సన్ కూడా చెలరేగిపోయి 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. వీరితో పాటు ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో శివమ్ దూబే కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు (నాటౌట్) రాబట్టాడు. దీంతో భారత జట్టు సెమీఫైనల్ తర్వాత ఫైనల్లో కూడా 250 పరుగుల మార్కును దాటింది. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది.
