Kohli: కోహ్లీ టార్గెట్ అదే

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు.

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 09:30 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు. విండీస్‌తో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న కోహ్లీ మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడనే దానిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఆసియాకప్‌లో కోహ్లీ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు.

ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. ఆసియాకప్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో విడుదల చేసింది. దీనిలో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. టీమిండియాకు ఆసియాకప్‌తో పాటు వరల్డ్ కప్ అందించడమే తన లక్ష్యమని కోహ్లీ చెబుతున్న ప్రోమోను స్టార్ స్పోర్ట్ రిలీజ్ చేసింది. భారత జట్టు విజయం కోసం ఓ ప్లేయర్‌గా తాను ఏం చేసేందుకైనా సిద్ధమేనంటూ కోహ్లీ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో ఉన్న కోహ్లీ ఈ సారి ఎలా ఆడతాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. రెండు ఫార్మెట్ లలో కలిసి 14 ఇన్నింగ్స్‌లలో 766 పరుగులు చేశాడు.

ప్రస్తుతం కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లాండ్ సిరీస్‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. కోహ్లి పేల‌వ ఫామ్‌పై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. కోహ్లిని టీమిండియా నుంచి ప‌క్కన‌పెట్టాలంటూ ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్‌కు సెలెక్టర్లు అత‌డికి విశ్రాంతినిచ్చారు. అసియా క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని కోహ్లికి రెస్ట్‌ను ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. యుఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుండి ఆసియా కప్ మొదలుకానుంది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో జరగనున్న ఈ టోర్నీలోనైనా కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు విరాట్‌ ఫామ్ అందుకోకుంటే కష్టమేనని భావిస్తున్నారు.