టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తం 7వేల 938 కిలోల బియ్యాన్ని జూన్ 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిపింది. వేలంలో పాల్గొనేవారు రూ. 50 వేల ఈఎండీ (EMD) చెల్లించాలన్నారు. టీటీడీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కొన్ని వస్తువులను, కానుకలను వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమకు తోచిన విధంగా కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. భక్తులు బంగారం, వెండి, విలువైన వస్తువులు, వాహనాలతో పాటుగా వస్త్రాలు, మొబైల్స్, వాచీలు, బియ్యం వంటివి కూడా ఇస్తుంటారు. అలాగే భక్తులు సమర్పించే తలనీలాలు, ఆలయంలో నెయ్యి, జీడిపప్పు వంటి సరుకులు తీసుకొచ్చిన టిన్లు కూడా ఉంటాయి. టీటీడీ ఎప్పటికప్పుడు ఈ వస్తువులకు వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల హుండీల ద్వారా భక్తులు బియ్యాన్ని సమర్పిస్తారు. జూన్ 11న ఆ బియ్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 లాట్లలో దాదాపు 7వేల 938 కిలోల బియ్యాన్ని వేలానికి ఉంచనున్నట్లు తెలిపారు. ఈ బియ్యం కోసం వేలంలో పాల్గొనాలి అనుకునేవారు జూన్ 10 ఉదయం 10 గంటలలోపు https://konugolu.ap.gov.in/ పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాలి. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో ఫోన్ నంబర్ 0877-2264429 ద్వారా సంప్రదించాలని సూచించారు. అలాగే మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ www.konugolu.ap.gov.in సందర్శించాలని టీటీడీ తెలిపింది.
టీటీడీకి భారీగా విరాళాలు
తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా విరాళాలు అందాయి. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్లోని కార్యాలయంలో దాత విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ బి. జగదీశ్వర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.
ఇటు బెంగుళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ నవీన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 11,11,111 విరాళంగా అందించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అదనపు ఈవో ఛాంబర్లో దాతకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగారం మురళీ పాల్గొన్నారు. దాతను టీటీడీ అదనపు ఈవో అభినందించారు.
విశాఖపట్నానికి చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. దాతను టీటీడీ ఈవో అభినందించారు.
