Tamilnadu: యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి అలా?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఈ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండడం అన్

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 03:25 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఈ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండడం అన్నది తప్పనిసరి. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ అన్ని సోషల్ మీడియా పైన డిపెండ్ అవుతున్నారు. వినోదం, టెక్నాలజీ, ఆరోగ్యం, క్రైమ్ ఇలా అన్నింటికీ సంబంధించిన విషయాలు మనకు ఆన్లైన్ లో సమాచారం లభిస్తుండడంతో చాలామంది ఉపయోగపడే పనులే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు కూడా చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక మైనర్ బాలిక యూట్యూబ్ చూసి తనకు తానుగా ప్రసవం చేసుకొని పుట్టిన బిడ్డను చెత్తకుప్పలో పారేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక భర్త యూట్యూబ్ చూసి అలాంటి పని చేశాడు.. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి సమీపంలో పులియాంపట్టి అనే గ్రామంలో లోకనాయకి అనే మహిళ ఉండేది . ఆమెకి 2021లో అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మాదేశ్ తన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి భార్య ఇటీవలే గర్భం దాల్చింది. దీంతో ఆమె భర్త మాదేశ్ ఒక కొత్త ఆలోచన చేశాడు. సేంద్రియ పద్ధతి లాగే తన భార్యకు కూడా ఎలాంటి మందుల సహాయం లేకుండానే సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు.

ఇందుకోసం లోకనాయకికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదు. అయితే స్థానికంగాంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ మాదేశ్ మాత్రం వారి మాట వినలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రసవ సమయంలో కూడా ప్రభుత్వం అందించేటటువంటి వ్యాక్సిన్లతో పాటుగా పౌష్టికాహారాన్ని కూడా నిరాకరించాడు. అతడే తన భార్యకు గింజలు, ఆకుకూరలు లాంటివి ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన ఇంట్లో లోకనాయకి ఉంది. అయితే ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. ఇక అది గమనించి భర్త మాదేశ్ యూట్యూబ్‌లో చూస్తూ తన భార్యకు ప్రసవం అయ్యేలా చేశాడు. చివరికి ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు సరైన రీతిలో వైద్యం అందలేదు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భర్త మాదేశ్ ఇక చేసేదేం లేక కన్నియర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే లోకనాయకి మరణించింది.

దీంతో భర్త మాదేశ్ షాకయ్యాడు. ఇక పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు యూట్యూబ్‌లో చూసి భార్యకు ప్రసవం చేయడం ఏంటని చాలామంది ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అతనిపై మండిపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.