ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీలో నాలుగు శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకం కింద రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం ఇస్తోంది. వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండే కుటుంబాల విద్యార్థులకు ఈ రుణం అందిస్తారు. బ్యాంకులు అందించే ఈ రుణాలపై 3శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తారు. ఈ రుణాలను కేవలం ట్యూషన్ ఫీజుకే కాకుండా, హాస్టల్, పరీక్ష, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, విద్యాసామాగ్రికి ఉపయోగించుకోవచ్చు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, మెడికల్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎమ్మె్సీ సీఏ, ఎంఏ తదితర డిగ్రీలు చదివిన విద్యార్థులు అర్హులు.
రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా బ్యాంకులు ప్రామాణిక విధానాన్ని రూపొందించి, ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు బ్యాంకులకు సూచించారు. బ్యాంకులు డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా వెంటనే స్పందిస్తే బావుంటుందన్నారు. సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ను బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకులు అర్హులకు రుణాలిచ్చేందుకు ముందుకు రావాలన్నారు. ఆక్వా రంగాన్ని బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రుణాలు బాగా పెంచాలన్నారు. డెయిరీ, ఆక్వాకల్చర్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ వంటి రంగాలు బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల లబ్ధిదారులకుపూర్తి ఆర్థిక చేయూత.. . గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరు చేయాలన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు చంద్రబాబు. రాజధానిలో ప్రతి బ్యాంకుకు ఐకానిక్ భవనం ఉండేలా చూసుకోవాలన్నారు.
బ్యాంకర్ల కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.8.10 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి రూ.3.60 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రూ.3.60 లక్షల కోట్లలో పంట రుణాల కింద రూ.2 లక్షల కోట్లు, టర్మ్ లోన్స్ కింద రూ.1.20 లక్షల కోట్లు, వ్యవసాయ మౌలిక వసతులు, అనుబంధ రంగాలకు రూ.40 వేల కోట్లు ఇవ్వనున్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎల్బీసీ రూ.6.60 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.9.04 లక్షల కోట్ల రుణాలిచ్చారు. ఇది దక్షిణాదిలోనే అత్యధికమని బ్యాంకర్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2,03,432 మంది కౌలు రైతులకు రూ.1,666 కోట్ల రుణం ఇచ్చామని బ్యాంకర్లు తెలిపారు.
