Viral Video: ఫోన్ లో మునిగిపోయిన మహిళ.. పై నుంచి దూసుకెళ్లిన రైలు!!

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 02:01 PM IST

ఆమె ఫోన్ లో మాట్లాడుతూ లోకాన్నే మర్చిపోయింది.. ఫోన్ లో ముచ్చట్లు పెడుతూనే రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆ మహిళ .. నడుచుకుంటూ రైల్వే ట్రాక్ ను దాటే ప్రయత్నం చేసింది. ఆమె రైల్వే ట్రాక్ పైకి చేరుకోగానే.. రయ్ అంటూ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అలుపెరగకుండా ఫోన్ లో మాట్లాడుతూనే ఆమె.. నిలువుగా పట్టాలపై నిద్రపోయి ప్రాణాలు కాపాడుకుంది. పట్టాలపై పడుకున్న సమయంలోనూ ఆమె ఫోన్ ను వదిలి పెట్టలేదు.. ఫోన్ లో మాట్లాడటాన్ని ఆపలేదు. ఎట్టకేలకు గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయాక.. రైల్వే ట్రాక్ పై లేచి నిలబడి కూడా కొన్ని నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడింది.

ఫోన్ కాల్ లో మునిగిపోవడంతో.. తాను ఎంతటి ప్రాణ గండం నుంచి బయటపడ్డదనే విషయం కూడా ఆమె బుర్రకు ఎక్కలేదు. ఎట్టకేలకు రైల్వే ట్రాక్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కిన తర్వాత ఆ మహిళ.. తన వీడియో తీసిన వ్యక్తితో మాట్లాడింది. ఐపీఎస్ అధికారి దీపాంశు కాబ్రా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కేవలం 3 రోజుల్లో దీనికి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళకు చివాట్లు పెట్టారు. ” లాగి ఒక చెంపదెబ్బ కొట్టి ఆమెను సత్కరించాలి” అని కొందరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే ఈ వీడియోను ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు. వెంటనే ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.