Munugodu By-Election : కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఓడించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్న టీకాంగ్రెస్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 07:02 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న్ని ఉప ఎన్నిక‌ల్లో ఓడించేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తుంది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంట‌నే మునుగోడు నియోజకవర్గానికి ఏడుగురు సభ్యులతో వ్యూహం, ప్రచార కమిటీని ఏఐసీసీ నియ‌మించింది. కమిటీ కన్వీనర్‌గా సీనియర్‌ నేత మధుయాష్కీగౌడ్‌, సభ్యులుగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాంనాయక్‌, దానసరి అనసూయ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, ఇ.అనిల్‌కుమార్‌ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తెలంగాణకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, బి. మాణికం ఠాగూర్ కమిటీని ఏర్పాటు చేశారు.

త్వరలో అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. దీంతో 2018 ఎన్నికల్లో ఆయన గెలిచిన అసెంబ్లీ సీటు ఖాళీ అవుతుంది. ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కీల‌కం కానుంది. దుబ్బాక‌, హుజురాబాద్‌లో ఓట‌మి పాలైన కాంగ్రెస్ పార్టీ త‌న సొంత సీటుని కాపాడుకునే ప‌నిలో ఉంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఊహించనిది కానప్పటికీ. ఇది కాంగ్రెస్‌కు మరో దెబ్బ అని చెప్పాలి. 2018 ఎన్నికల్లో 119 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత 12మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటును నిలుపుకోవడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. 2019 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే గ‌త కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం ఐదుకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్ని మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇన్ చార్జి పిలుపునిచ్చారు.

గత రెండేళ్లలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటూ 2023లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే దూకుడుగా పని చేస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు పుంజుకోవడానికి మరో అవకాశం ఇస్తుంది.