Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి […]

Published By: HashtagU Telugu Desk
Heavy rains in Telangana

Heavy rains in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి సాగు తీవ్రంగా మందగించగా, ఇతర పంటల సాగు కూడా లక్ష్యానికి చాలా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొత్తం 65,95,645 ఎకరాల్లో వరి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వర్షాలు ముఖం చాటేయడంతో ఇప్పటి వరకు కేవలం 4,22,340 ఎకరాల్లో మాత్రమే (అంటే 6.40 శాతం) నాట్లు పడ్డాయి. నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో అన్నదాతలు వరి నాట్లు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. వరితో పాటు రాష్ట్రంలో అన్ని రకాల పంటలైన పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల సాగును పరిశీలిస్తే, మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలుగా అంచనా వేశారు. కానీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కేవలం 55,31,812 ఎకరాల్లో (41.79 శాతం) మాత్రమే విత్తనాలు నాటడం లేదా పంటలు వేయడం పూర్తయింది. అంటే సగానికి పైగా సాగు భూములు ఇంకా బీడుగానే ఉన్నాయి.

వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం, జూలై నెలలో సగటున 47.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 39.9 మి.మీ. మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. అలాగే జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 177.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 154.9 మి.మీ. మాత్రమే కురిసింది. ఇది సీజన్ సగటు కంటే 13 శాతం లోటుగా రికార్డయింది.

లోటు వర్షపాతం ఉన్న 16 జిల్లాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ ఉన్నాయి. అయితే వర్షాల కొరత కారణంగా జిల్లాల వారీగా సాగు విస్తీర్ణంలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, మేడ్చల్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో పంటల సాగు 25 శాతం కూడా దాటలేదు. ఇక నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో కొంతవరకు పరవాలేదనేలా 51 శాతం మేర సాగు పనులు జరిగాయి.

వర్షాలు కొంత అనుకూలించిన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గరిష్టంగా 75 శాతం విస్తీర్ణంలో సాగు చేపట్టారు. రాబోయే రోజుల్లో అయినా భారీ వర్షాలు కురిస్తేనే వరి నాట్లు ఊపందుకునే అవకాశం ఉందని, లేనిపక్షంలో సాగు విస్తీర్ణం మరింత తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

  Last Updated: 09 Jul 2026, 09:23 AM IST