Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Published By: HashtagU Telugu Desk

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపు లక్షమందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో గమనించాను. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టి వచ్చింది. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారు. ఇవన్ని చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందచేశాను.

ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పెద్ద ఉద్యమంలా చేపట్టారు. లక్ష మందికిపైగా సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించారు. ఈ కార్యక్రమాన్ని మన కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టింది. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడింపించాలని, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

  Last Updated: 17 Feb 2022, 04:38 PM IST