ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ మావోయిస్టులు ఈస్ట్ డివిజన్ కమిటీ పేరతో లేఖ విడుదల చేశారు. పాడేరు ఎమ్మెల్యే సహా నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని.. బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయలేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని..లేదంటే మన్యం విడిచి వెళ్లాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేశారు.ఆ హత్య తరువాత ప్రజాప్రతినిధులు భయంతో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. అయినప్పటికి తాజాగా మావోయిస్టుల హెచ్చరికలతో ఎమ్మెల్యేలు అప్రమత్తమైయ్యారు.