Gangetic Dolphin : ఉత్తరప్రదేశ్ జల జంతువుగా గంగానది డాల్ఫిన్ ను గుర్తించారు. రాష్ట్రంలోని గంగా, యమునా, చంబల్ ఘఘ్రా, రాప్తి, గెరువా మొదలైన నదులలో గంగా డాల్ఫిన్లు కనిపిస్తాయి. రాష్ట్రంలోని నదుల్లో దాదాపు 2000 గంగా డాల్ఫిన్లు ఉన్నాయని ఒక అంచనా. గంగానది డాల్ఫిన్లను వేటాడడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హమైన నేరం. యూపీ ప్రజలు గంగా డాల్ఫిన్ ను సున్సా చేప అని కూడా పిలుస్తుంటారు. ఈ డాల్ఫిన్లు కొన్నిసార్లు నదుల నుంచి కాలువలలోకి కూడా ప్రవేశిస్తుంటాయి. ఈక్రమంలో కొన్నిచోట్ల గ్రామస్థులు వాటిని చంపేస్తుంటారు. ప్రతాప్గఢ్ అనే గ్రామంలో ఒకసారి గంగా డాల్ఫిన్ను చంపిన వారిపై (Gangetic Dolphin) కేసు నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
గంగా డాల్ఫిన్ల గురించి మరిన్ని వివరాలు
- 2009 అక్టోబరు 5న నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన గంగా రివర్ వ్యాలీ అథారిటీ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సూచన మేరకు అంతరించిపోతున్న గంగా డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా ప్రకటించారు. ఆరోజే గంగా డాల్ఫిన్ ను అంతరించిపోతున్న జలచరాల జాబితాలో చేర్చారు.
- గంగా నది డాల్ఫిన్ల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 న ‘గంగా నది డాల్ఫిన్ దినోత్సవాన్ని’ జరుపుకుంటారు.
- 2009 సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009లో అక్టోబరు 5నే గంగా డాల్ఫిన్ను జాతీయ జలచరాలుగా ప్రకటించారు.
- 2009 నుంచి ప్రతి సంవత్సరం గంగా డాల్ఫిన్ల సంఖ్యను లెక్కిస్తుంటారు.
- అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా బృందం వాటి ఉనికిపై ప్రత్యేక నిఘా ఉంచింది.
- వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 2012లో డాల్ఫిన్ పరిరక్షణ ప్రచారాన్ని ప్రారంభించాయి.
- గంగా డాల్ఫిన్లు అరుదైనవి. ఇవి నది ఉపరితలంపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటాయి.
- గంగా డాల్ఫిన్లు గుడ్డివి, అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల సహాయంతో తమ ఎరను పట్టుకుంటాయి. ఇవి మంచినీటిలో మాత్రమే జీవించగలవు.
Also read : Fire Accident : కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు