వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను హైదరాబాద్కి తీసుకువచ్చి హోటల్ గదుల్లో వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు స్కోక్కా.ఇన్, లోకాంటో, వివాస్ట్రీట్ తదితర వెబ్సైట్లను ఉపయోగించి హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వాట్సప్ ద్వారా కూడా విటులను ఈ ముఠా ఆకర్షిస్తున్నారు. నిందితులు మోహిత్ సత్పాల్ గార్గ్, జై సాహా, జన్వర్ విశాల్, సోహైల్ అహ్మద్, మహ్మద్ ఖలీల్, ముంతా శ్రీకాంత్, ముల్లా నస్రిన్, మెహెదీ దాస్లను అరెస్టు చేశారు. పై నిందితులపై మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసు నమోదు చేశారు. వారి నుంచి 31 స్మార్ట్ ఫోన్లు, నాలుగు కీప్యాడ్ ఫోన్లు, ఐదు ల్యాప్ టాప్ లు, రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఇతర బ్యాంకు కార్డులు స్వాధీనం చేసుకున్నారు.