Innovative Wedding : బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా హస్పురాలో ఓ వివాహ వేడుక ఆదర్శప్రాయంగా జరిగింది. హస్పురాలో అతిపెద్ద రక్తదాతగా అనీష్కు మంచిపేరు ఉంది. అతన్ని అందరూ ‘రక్తవీర్’ అని పిలుస్తుంటారు. ఇటీవల అతడికి పెళ్లి నిశ్చయమైంది. తన పెళ్లి వేడుకకు వచ్చే వారితోనూ రక్తదానం చేయించాలని అనీష్ అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని వధువు తరపు వారికి తెలియజేశాడు. ఆడపిల్ల తరఫు వారిలో ఆసక్తి కలిగిన వారిని రక్తదానం చేయాలని కోరాడు. దీనికి ఆడపిల్ల తరఫు వారిలో చాలామంది ఓకే చెప్పారు. ఇందుకు అనుగుణంగానే పెళ్లి వేడుకలో వధువు వైపు, వరుడి వైపు నుంచి దాదాపు 70 మంది బ్లడ్ డొనేషన్ (Innovative Wedding) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ రంజన్ వచ్చి పెళ్లివారింట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేష్ చెప్పారు. రక్తం కొరతతో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వివాహ వేడుకల్లో ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పెళ్లి రోజున చేసిన రక్తదానం తనకు 14వ సారి అని అనీష్ తెలిపాడు. రక్తవీర్ యోద్ధా జిల్లా కమిటీ సహకారంతో తన పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయించానన్నాడు.
రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలామంది భయపడతారు. వాస్తవానికి రక్తం ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వైద్యులు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తరువాతే మన నుంచి రక్తం తీసుకుంటారు. రక్తదానం చేసిన తరువాత ఆరు నుంచి పన్నెండు వారాలలోపు వ్యక్తికి పూర్తిస్థాయిలో కొత్త రక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తవు.