ఒక వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం, మరొక వైపు తగ్గుతున్న డిజిటల్ ప్రాజెక్ట్లు వెరసి కరోనా తరువాత ఉద్యోగాల ఊస్ట్కు కారణమౌతున్నాయి. కేవలం ఒక్క ఐటి సెక్టార్లోనే కాదు.. అన్ని రంగాల్లోను ఉద్యోగుల కోతలు (Layoffs) జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రోజుకు సరాసరిన 2500 మంది ఉద్యోగులు వివిధ రంగాల్లో ఉద్యోగాలను కోల్పోతున్నారని సర్వేలు చెపుతున్నాయి.
2023 ఐటి, ఐటిఇఎస్ రంగాల ఉద్యోగులను భయపెట్టిస్తోంది.. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియక కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, వ్యయాలు తగ్గించుకునే మార్గాలను టెక్నాలజీ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. పెద్ద ఐటీ కంపెనీల వ్యయాల్లో 62-65 శాతం ఉద్యోగుల జీతభత్యాలే అయినందున, తొలుత ఈ విభాగ ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యలో భారీ కోతలు ప్రకటిస్తున్నాయి.
కొవిడ్ పరిణామాల్లో అనేక రంగాలు, సంస్థలు డిజిటలీకరణ బాట పట్టాయి. లాక్డౌన్ల వల్ల ఇళ్ల దగ్గర ఖాళీగా ఉన్న ప్రజలు యూట్యూబ్లో వీడియోలు చూడటం, సామాజిక మాధ్యమాలు వినియోగించడం గణనీయంగా పెరిగింది. మందులు, నిత్యావసరాల కొనుగోళ్లకు ఇకామర్స్ సైట్లను, విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి ఎడ్టెక్ సంస్థలను ఆశ్రయించడంతో వాటికీ ఉద్యోగుల అవసరం పెరిగింది. ఫలితంగా టెక్ సంస్థలు ఎడాపెడా నియామకాలు జరిపాయి. అవసరమైన నైపుణ్యాలున్న వారికి అత్యధిక వేతనాలు ఆఫర్ చేశాయి. అంతేనా.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే, మరొక సంస్థ ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నా అంటే మూన్లైటింగ్ చూసీచూడనట్లు వ్యవహరించాయి.
కొత్తగా వస్తున్న డిజిటలైజేషన్ ప్రాజెక్టుల సంఖ్య తగ్గడం, కొవిడ్ పరిణామాల తరవాత సామాజిక మాధ్యమాల వినియోగమూ పరిమితం అవుతుండడం, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో విభిన్న రంగాల సంస్థలు తమ టెక్ వ్యయాలపై ఆచితూచి వ్యవహరిస్తుండటం.. టెక్ కంపెనీలకు కష్టాలు తెచ్చిపెడుతున్న అంశాలు. ప్రాజెక్టులు తగ్గగానే ఆయా కంపెనీలకు సిబ్బంది అధికంగా కనపడుతున్నారు. ఫలితంగా గత ఏడాదిలోనే భారీ కోతలకు తెరలేపారు. 2022లో అంతర్జాతీయంగా 1,000కి పైగా ఐటీ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 1.54 లక్షలు గా ఉన్నాయి. ఈనెలారంభం నుంచి 20వ తేదీ వరకు 173 కంపెనీలు 56 వేల మందిని మందికి పైగా తొలగించాయి.. అంటే సగటున రోజుకు 2,800 మంది ఐటీ నిపుణులపై వేటు పడుతోంది.
Also Read: Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం
అంతర్జాతీయ టెక్ రంగంలో భారతీయ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. దేశీయంగా, అమెరికా, ఐరోపాల్లోనూ భారతీయ సాంకేతిక నిపుణులు ఎంతోమంది పనిచేస్తున్నారు. అందుకే భారత్ సహా అంతర్జాతీయంగా అమెజాన్ 18వేల మందిని, గూగుల్ 12వేల మందిని , మెటా 11 వేల మందిని , మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాయి. ఇవేకాకుండా సోషల్ సైట్ షేర్చాట్ 500 మందిని, ఆన్లైన్ ఆర్డర్లపై ఆహారం సరఫరా చేసే స్విగ్గీ 380 మందిని, ఓలా 200 మందిని, సరుకుల డెలివరీ సంస్ధ డుంజో 80 మంది వరకు తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ సాఫాస్ 450 మందిని అంతర్జాతీయంగా తొలగించనుంది. ఆర్థిక పరిస్థితులు నెమ్మదించిన నేపథ్యంలో మరింత మంది ఉద్యోగుల కోత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.