Tiger : తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో వారం రోజుల పాటు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా, ఏలూరు జిల్లాలో గోదావరి దాటి తూర్పుగోదావరిలోకి ప్రవేశించిన ఈ పులిని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించిన సంగతి తెలిసిందే. కూర్మాపురంలోని ఒక పశువుల పాక వద్ద మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న ఈ పులిని, వెంటనే విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కుకు తరలించి నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం పులి పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న అధికారులు, దానిని సురక్షితంగా పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
రేడియో కాలర్ అంటే ఏమిటి? ఎందుకు అమర్చారు?
పులిని అడవిలో వదిలే ముందు అటవీశాఖ అధికారులు దాని మెడకు ‘రేడియో కాలర్’ (Radio Collar) అనే పరికరాన్ని అమర్చారు. ఇది ఒక శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ లా పనిచేస్తుంది. పులి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా చూడటం, అది ఏ దిశలో ప్రయాణిస్తోంది, దాని వేట ఎలా సాగుతోంది వంటి అంశాలను అటవీ అధికారులు కార్యాలయం నుంచే పర్యవేక్షించవచ్చు. దీని ద్వారా పులి కదలికలను నిరంతరం గుర్తిస్తూ, ఒకవేళ అది తిరిగి గ్రామాల వైపు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానికులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. అడవిలో పులి తన సహజ సిద్ధమైన జీవనాన్ని సాగించేలా చూడటమే ఈ సాంకేతికత ప్రధాన ఉద్దేశ్యం.
కూర్మాపురంలో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒక యుద్ధాన్ని తలపించింది. పుణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో పాటు, స్థానిక రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. పులి తొలుత ఒక పాత ఇంట్లోకి, ఆ తర్వాత వరి పొలాల్లోకి, చివరికి పశువుల పాకలోకి వెళ్లడంతో అధికారులు ఎంతో సహనంతో వేచి చూశారు. గేదెలపై దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో మత్తు ఇంజక్షన్ గన్తో గురిపెట్టి కొట్టగా, అది కొద్దిదూరంలోనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత బోనులో బంధించి రాజమహేంద్రవరం మీదుగా విశాఖకు తరలించారు. అడవిలో విడిచిపెట్టే ముందు చేసిన వైద్య పరీక్షల్లో పులి వేగంగా కోలుకున్నట్లు తేలడంతో, రెండు రోజుల క్రితమే దానిని రోడ్డు మార్గంలో పాపికొండలు అడవులకు తరలించి స్వేచ్ఛగా వదిలేశారు.
