రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో రోజుకు సుమారు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఇందులో కేవలం సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన 2.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, ఇటీవల స్థానిక వినియోగం తగ్గడంతో పాటు ఎగుమతులు మందగించాయి. దీనికి తోడు, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా మారింది. చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం నేరుగా ఏపీలోని పౌల్ట్రీ మార్కెట్ను దెబ్బతీసింది.
ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఒక్కో గుడ్డు ధరను రూ.4.20గా నిర్ణయించింది. అయితే, హోల్సేల్ ధర ఇంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ మార్కెట్లో మాత్రం వినియోగదారులకు ఆ ప్రయోజనం పూర్తిస్థాయిలో అందడం లేదు. చికెన్ షాపుల్లో గుడ్డును రూ.5 నుంచి రూ.5.50కి, కిరాణా దుకాణాల్లో రూ.6 వరకు అమ్ముతున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678 పలికింది. అప్పట్లో రిటైల్గా ఒక్కో గుడ్డును రూ.8కి విక్రయించారు. ఆ రికార్డు స్థాయి నుంచి ధరలు ఇంతలా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో కలకలం రేపుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి పడిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో కేవలం గుడ్ల ఎగుమతులే కాకుండా అనేక ఇతర రంగాలపైనా ప్రభావం పడుతోంది. ఉత్పత్తికి తగిన ధర రాకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
