రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనుంది. ఏటా మూడుసార్లు నిధులను విడుదల చేస్తున్న కేంద్రం.. జూన్ 20న (శనివారం) పీఎం కిసాన్ యోజన 23వ విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ యోజన కలిపి అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 14 వేలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ యోజన సాయం రూ. 6,000 కలిపి.. అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20 వేలు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తోంది.
ఈ 20 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా రైతులకు అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. రూ. 7,000, రూ. 7,000, రూ. 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఒక విడత నిధులు జమ చేయగా.. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన అందించే జూన్ 20వ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిధుల విడుదల రోజే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో జూన్ 20న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు అర్హులైన రైతులు అన్నదాత సుఖీభవ పథకం సాయం కోల్పోకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం తప్పుల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఏవైనా తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ సాయం పొందని రైతులు.. తమ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే భూముల వివరాలకు ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆధార్ ఇన్-యాక్టివ్ అని వస్తుంటే సరిచేయించుకోవాలని చెప్తున్నారు. ఇక పీఎం కిసాన్ యోజన సాయం పొందడానికి ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి అని చెప్తున్నారు.
