Site icon HashtagU Telugu

Trump Tariffs Effect : ఏపీలో భారీగా పడిపోయిన రొయ్యల ధరలు

Donald Trump Tariffs Effect

Donald Trump Tariffs Effect

డోనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్ల (Trump Tariffs) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా(Aqua ) రంగంపై తీవ్రంగా పడుతోంది. ఏటా రూ.20 వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్, ఈ నిర్ణయంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రొయ్యల దిగుమతులపై 50% సుంకం విధిస్తామని ప్రకటనతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లోని రొయ్యల రైతుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ట్రంప్ సుంకం పెంపు ప్రకటనతో రొయ్యల ఎగుమతిదారులు వెంటనే ధరలను భారీగా తగ్గించారు. ఇది రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. ముఖ్యంగా 25 కౌంట్ కిలో రొయ్యల ధర రూ. 565 నుంచి రూ.430కి పడిపోయింది. ఇది ఒక కిలోపై ఏకంగా రూ.135 నష్టం. మిగతా రొయ్యల రకాల ధరలు కూడా కిలోపై రూ.35 నుంచి రూ.80 వరకు తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల తగ్గుదల వల్ల పెట్టుబడులు కూడా వెనక్కి రాని పరిస్థితి నెలకొంది.

World Lion Day 2025 : సింహాలు ప్రతిరోజు ఎన్ని కేజీల మాంసం తింటాయో తెలుసా..?

ఈ పరిణామం వల్ల ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులు, ఈ సుంకం ప్రభావంతో మరిన్ని అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఏపీ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున, ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ప్రభుత్వాలు తక్షణం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుంకాన్ని తగ్గించేలా ప్రయత్నించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే, రాబోయే రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగే అవకాశం ఉంది.