ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళుతున్నారు. శనివారం ఆయన భుజానికి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. గత నెలాఖరులో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పవన్ రెండు భుజాలకు వెంటనే సర్జరీలు చేయాలని డాక్టర్లు సూచించారు. ముందుగా శనివారం రోజు ఒక భుజానికి సర్జరీ చేస్తారు, ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజుల విరామం తర్వాత మరో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బందిపడతారని డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్కు కొద్దిరోజుల గ్యాప్లో రెండు సర్జరీలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సర్జరీల కారణంగా దాదాపు 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాల కండరాలు పూర్తిగా చిట్లడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. భుజం కీలు చుట్టూ ఉండే కండరాలు, స్నాయువుల్ని కలిపి రొటేటర్ కఫ్ అంటారు. దీనికి గాయమైతే దానిని రొటేటర్ కఫ్ గాయం అంటారు. రొటేటర్ కఫ్ గాయం కారణంగా భుజంలో భరించలేని నొప్పి, వాపుతో చేయి కదిలించలేరు. చేతులను పైకి ఎత్తడానికి, వస్తువులను పట్టుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. ఒకవేళ అలా చేస్తే నొప్పిగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకోనున్నారు.
పవన్ కళ్యాణ్ సర్జరీకి ముందు పార్టీ కార్యకలాపాలు సజావుగా కొనసాగేలా ముందుగానే నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల వారీగా కార్యకలాపాలపై చర్చించారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నేతలకు సూచించారు. జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అందరూ బాధ్యతగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. అంతేకాదు రాష్ట్రంలో నవంబరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఈ మేరకు నేతలు సిద్ధం కావాలని, కేడర్ను సిద్ధం చేయాలన్నారు.
జనసేన కేడర్తో కూడా మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలి. వారి సాధకబాధకాలను తెలుసుకొని భరోసా ఇవ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు తెలియజేయాలి’ అన్నారు. ఈ సమావేశంలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులుగా వెళ్ళిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను పవన్ కళ్యాణ్కు వివరించారు. జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
