2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ, పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి పేర్కొన్నారు. యువనేత నారా లోకేష్ చేసిన ఈ ప్రకటన మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాట్లాడటమే కాకుండా.. ఆచరణలో చూపిస్తూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని మాధవిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ పదవులు, ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి సామాజిక న్యాయానికి బాటలు వేసారని ఆమె గుర్తు చేశారు. అనంతరం నారా చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచారని తెలిపారు.
డ్వాక్రా సంఘాల బలోపేతం, మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు, దీపం పథకం, వితంతు పింఛన్లు వంటి పథకాలు మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోందని.. చట్టం అమల్లోకి రాకపోయినా పార్టీ స్వచ్ఛందంగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించడం దేశ రాజకీయాల్లో అరుదైన పరిణామం అని మాధవి రెడ్డి తెలిపారు. దేశ జనాభాలో మహిళలు సగం ఉన్నప్పటికీ, జీడీపీలో వారి భాగస్వామ్యం అధికారిక లెక్కల్లో తక్కువగా కనిపిస్తోందని మాధవిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, కుటుంబ వ్యాపారాలు, అసంఘటిత రంగాల్లో మహిళలు చేస్తున్న అపారమైన కృషికి తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో 12 లక్షల డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మందికి పైగా మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించామని తెలిపారు. బ్యాంక్ లింకేజీల ద్వారా రూ.68 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, మహిళా పింఛన్లు, ఆరోగ్య పరీక్షలు, స్వయం ఉపాధి పథకాల ద్వారా మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. “33 శాతం మహిళా రిజర్వేషన్ అనేది ఎవరైనా ఇచ్చిన భిక్ష కాదు. అది మహిళల హక్కు” అని మాధవిరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలు మరింత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని ఇతర రాజకీయ పార్టీలపై కూడా ప్రభావం చూపుతుందని, మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా అమలు చేసే వాతావరణం ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
