TDP : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 శాతం బోగస్ ఓట్లే.. బోగస్ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసిన వర్ల రామ‌య్య‌

వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రసహనంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమ‌ర్శించారు.

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 06:49 AM IST

వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రసహనంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమ‌ర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదుపై న్యాయవాది వజ్జా శ్రీనివాస్ తో కలిసి వర్ల రామయ్య సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ….ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వేల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తోందన్నారు. పట్టభద్రుల ఓటర్ లిస్ట్ లో 30 శాతం బోగస్ ఓట్లేన‌ని… 10 తరగతి చదవని వాళ్లను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేశారని ఆయ‌న ఆరోపించారు. ఒకే ఇంటి అడ్రస్ తో 44 ఓట్లు, వైసీపీ పార్టీ ఆఫీస్ అడ్రస్ తో 38 ఓట్లు ఉన్నాయని.. ఒక్క తిరుపతిలోనే 7 వేల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని… పోలీసులే పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడుతారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బోగస్ ఓట్ల ప్రక్రియ సాగుతోందని..తిరుపతి ఎస్పీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు ఆడుతూ బోగస్ ఓట్లకు సహకరిస్తున్నారని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. బోగస్ ఓట్లపై ఆధారాలతో సహా సీఈసీకి అందజేశామ‌ని.., దీనిపై విచారణ జరిపి బోగస్ ఓట్ల ప్రక్రియలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్క అధికారి, వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామ‌న్నారు. దీనికి సీఈసీ స్పందిస్తూ వర్ల ఫిర్యాదుపై ఒకటి రెండు రోజుల్లోనే పోలీసులు, రిటర్నింగ్ అధికారులతో నివేదిక తెప్పించుకుంటామమని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని తెలిపారని.. అంతే కాకుండా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని పోలింగ్ బూత్ లోనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకునేలా సంబందిత రిటర్నింగ్ అధికారులకు తగు సూచనలిస్తామని సీఈసీ త‌మ‌కు హామీ ఇచ్చార‌ని తెలిపారు.