Parliament Session : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అఖిలపక్ష సమావేశంలో తమ గళాన్ని బలంగా వినిపించారు. నదుల అనుసంధానంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ (TDP) లోక్సభాపక్ష నేత, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువుపై ఆయన స్పష్టతనిస్తూ, 2027 మార్చి నాటికి పోలవరం ఫేజ్-1 పనులను పూర్తి చేస్తామని సగర్వంగా ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాలు – ఆక్వా రైతుల సమస్యలపై జనసేన ఎంపీ బాలశౌరి వ్యాఖ్యలు
మరోవైపు, రాష్ట్ర విభజన హామీలు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి అఖిలపక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రక్రియల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. వీటితో పాటు ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని, ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతామని బాలశౌరి స్పష్టం చేశారు.
